దొడ్డబళ్లాపురం: కావేరి జలాల పోరాటానికి సంబంధించి తాను ఎల్లప్పుడూ కన్నడిగులకు తోడుగా ఉంటానని కిచ్చ సుదీప్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కన్నడ భాష, నేల, జలాల విషయంలో కన్నడపర సంఘాలు చేసే ప్రతి పోరాటంలో తాను తోడుగా ఉంటానన్నారు. వర్షాభావం కారణంగా రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి, ప్రజలకు తాగడానికి నీటి కొరత ఏర్పడిందన్నారు. పర్యాయ మార్గం లేని మనం కావేరి జలాలనే నమ్ముకున్నామన్నారు. తనకు తెలిసినంత వరకూ కరువు అధ్యయన కమిటీ, కావేరి కమిటీలోని జల నిపుణులు తక్షణం ట్రిబ్యునల్ కోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక రాష్ట్రంలోని కావేరి జలాల పరిస్థితి గురించి వివరించాలన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రితో సామరస్యంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. కావేరి వివాదంతో పాటు ఉత్తర కర్ణాటక కృష్ణానది, మహదాయి నది, కళసాబండూరి వివాదాలు కూడా పరిష్కరించాలని ఆశిస్తున్నానన్నారు.