
సీబీఐ అధికారి పేరుతో నకిలీ కార్డు
రాయచూరు రూరల్: జిల్లాలో రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. 15 రోజుల క్రితం కలబుర్గి వాసులు ప్రైవేట్ వైద్యుడిపై పిస్తోలు ఎక్కు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తూ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. వైద్యుడి విషయం కనుమరుగు కాక మునుపే నగల వ్యాపారిపై దుండగుల కన్నుపడింది.
రెండు రోజుల క్రితం రాయచూరు షరాఫ్ బజారులో సురేష్ అనే బంగారు నగల దుకాణదారుడికి ఫోన్ చేసి తన పేరు సుబోధ్ కుమార్ జైస్వాల్, న్యూఢిల్లీకి చెందిన సీబీఐ అధికారినంటూ వాట్సప్లో సందేశం పంపడమేగాక రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే నగల వ్యాపారి భభయపడకుండా సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణలో అది నకిలీ ఫేస్బుక్ ఖాతా అని తేలింది. దీంతో నగల వ్యాపారి ఊపిరి పీల్చుకున్నారు.