
కేఆర్ మార్కెట్లో జోరుగా పూల వ్యాపారం
శివాజీనగర: విఘ్నాలు తొలగించి ఏడాదంతా సాఫీగా సాగిపోయేలా అందరూ భక్తిశ్రద్ధలతో గణనాథున్ని పూజించడం ఆనవాయితీ. ఇందుకోసం వినాయక చతుర్థి పండుగ కోసం సిలికాన్ సిటీలో ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. వీధుల్లో మండపాల్లో పెద్ద గణపతులను, ఇళ్లలో బుజ్జి వినాయకుల్ని ప్రతిష్టించి నైవేద్యాల సమర్పణకు ఒక్కరోజే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నగరమంతటా గణేశ నిమజ్జనానికి చెరువులు, పుష్కరిణుల వద్ద సన్నాహాలు చేపట్టారు. ఇందుకోసం పాలికె వందకు పైగా స్థలాలను ఏర్పాటు చేసింది.
చిన్న విగ్రహాలకు మొబైల్ ట్యాంకర్లు
చిన్న విగ్రహాలను సులువుగా జలార్పణం చేయడానికి మొబైల్ ట్యాంకులను నడపనున్నట్లు పాలికె అధికారులు తెలిపారు. 5 ఇంచుల నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన అన్ని మట్టి విగ్రహాలను ఈ ట్యాంకుల్లో నిమజ్జనం చేయవచ్చు. అంతకంటే పెద్ద మూర్తుల కోసం నగరమంతటా 12 చోట్ల చెరువులను, మడుగులను నిర్దేశించారు. యడియూరు, హెబ్బాళ, శాంకీ చెరువులకు అధిక సంఖ్యలో రద్దీ ఉన్నందున ఇక్కడ కల్యాణిల్లో పూడికతీసి, రంగులు వేశారు. అంతటా పోలీసులు, సీసీ కెమెరాలు, లైట్లు, క్రేన్, అంబులెన్స్ వసతులు ఉంటాయని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కూర్చోబెట్టడం, నిమజ్జనం చేయరాదని సూచించారు.
విగ్రహాలు, పూలు పండ్లకు గిరాకీ
మరోవైపు నగరంలో ట్యానరీ రోడ్డు, శివాజీనగర, బాణసవాడి, హలసూరు, మల్లేశ్వరం, యశ్వంతపురతో పాటుగా వివిధ స్థలాల్లో గౌరీ–గణేశ విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.100 నుండి రూ.2 లక్షల వరకు విలువైన విగ్రహాలు మార్కెట్లో ఉన్నాయి. అలాగే పూలు, పండ్లు, చెరుకులు వంటి పూజా సామగ్రి అమ్మకాలు జోరందుకున్నాయి. మార్కెట్లలో పండుగ సందడి అలముకొంది.
ఐటీ సిటీలో చురుగ్గా ఏర్పాట్లు

శనివారం బెంగళూరు గాంధీనగరలో గణపతి విగ్రహాల విక్రయాలు