
సోమప్ప చెరువు
కంప్లి: నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన సోమప్ప చెరువు నేడు దుస్థితికి చేరింది. 2019 మే 29న రూ.7.6 కోట్లు ఖర్చు చేసి చెరువును ఆధునీకరించారు. 2022 ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేశారు. 39 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ప్రాంతంలో 30 ఎకరాల్లో ఉద్యానవనం, పిల్లలకు ఉల్లాసం కల్గించేందుకు క్రీడా సామగ్రి, విద్యుత్ దీపాల అలంకరణ, హైమ్యాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. సేద తీరేందుకు వచ్చే వారికి గ్రంథాలయం, చెరువు గట్టు చుట్టు బందోబస్తుగా రోడ్డును నిర్మించి ఉదయం, సాయంత్రం ప్రజలు వాకింగ్ చేసుకునేలా సౌకర్యాలు కల్పించారు. విశ్రాంతి కోసం విచ్చేసే వారికి మరుగుదొడ్లు కూడా నిర్మించారు. అయితే ఇటీవల ఆకతాయిలు కొందరు ఆడుకునే సామగ్రిని విరగ్గొట్టి మూలకు వేశారు. గ్రంఽథాలయం కిటికీల అద్దాలను పగులగొట్టారు. ఆలనాపాలన లేకపోవడంతో ప్రజలు బహిరంగంగానే మలమూత్ర విసర్జన చేసి సందర్శకులకు అసౌకర్యం కల్గిస్తున్నారు. రాత్రిళ్లు మందు బాబులకు నిలయంగా మారింది. పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా కన్నకలలు నేడు నీరుగారిపోతున్నాయి. చెరువు ఎదురుగా మున్సిపల్ కార్యాలయం ఉన్నా పట్టించుకునే నాధులే లేరు. ఇకనైనా చెరువు రక్షణకు మున్సిపాల్టీ పరంగా ఇద్దరిని ఏర్పాటు చేసి చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.