గ్యారంటీలతో కాంగ్రెస్ వంచన
కోలారు: గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను వంచనకు గురిస్తోందని కోలారు లోక్సభ సభ్యుడు ఎస్.మునిస్వామి ఆరోపించారు. శుక్రవారం నగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్ ఎలాంటి షరతులు లేకుండా గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచిన తరువాత పథకాల అమలుకు షరతులను విధిస్తూ మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికీ గ్యారంటీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
వైభవంగా మద్దూరమ్మ జాతర
మాలూరు: తాలూకాలోని మరపనహళ్లి క్రాస్లో వెలసిన మద్దూరమ్మ దేవి జాతర మహోత్సవ వేడుకలను గ్రామస్తులు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. జాతరలో భాగంగా సిడి ఉత్సవం, కుందేలు సారోటి కార్యక్రమాన్ని నెరవేర్చారు. కుందేలుతో సిడీరణ్ణకు వివాహం చేయడం సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచారం. జాతరలో భాగంగా పాల్గొన్న వేలాది భక్తులకు అన్నదానం చేశారు.
శ్రమతో లక్ష్యసాధన సులభం
కోలారు: విద్యార్థులు తమ కలల సాకారానికి నిరంతరం శ్రమించాలని, కఠోరశ్రమ ద్వారా లక్ష్యాలను సులువుగా చేరుకోగలమని జెడ్పీ సాంఖ్యిక అధికారి కృష్ణమూర్తి అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని జెడ్పీ సభాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందించి మాట్లాడారు. జిల్లాలో 75 న్యానో ఉపగ్రహాల లాంఛింగ్ పథకంలో భాగంగా విద్యార్థుల్లో అంతరిక్ష పరిసరాలు, ఉపగ్రహాలు ఇతర సంబంధిత విషయాలపై అవగాహన, వివిధ విజ్ఞాన విషయాలపై వ్యాసరచన పోటీలను ఆన్లైన్ ద్వారా ఉన్నత పాశఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో విజేతలుగా నిలిచిన 9 మందికి బహుమతులు, సర్టిఫికెట్లను అందించారు.