గంగావతి: నరేగ పథకం కూలీలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని హేరూరు గ్రామ పంచాయతీ పీడీఓ రఘుశాస్త్రి అన్నారు. పంచాయతీ పరిధిలోని నాగల చెరువులో ఈ పథకం కింద పూడికతీత పని చేసే కూలీలకు ఏర్పాటు చేసిన ఉచిత చికిత్స శిబిరంలో 198 మంది కూలీలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. శిబిరంలో నరేగ పథకం అధికారి బసవరాజ్ జటగి, ఆరోగ్య శాఖాధికారి శరణబసవ, శివప్ప చౌహాన్, వెంకోబ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఎద్దుల పండుగ
రాయచూరు రూరల్: మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో శనివారం నుంచి నగరంలో మూడు రోజుల పాటు ఎద్దుల పండుగ జరుగుతుంది. ఉత్సవాల నిర్వహణ కోసం ఏపీఎంసీ మైదానంలో ఏర్పాట్లను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఏ.పాపారెడ్డి పరిశీలించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎద్దులకు ఏరువాక పున్నమి సందర్భంగా రాతి దూలం లాగే పోటీలు, పురుష, మహిళా ఫైల్వాన్లకు కుస్తీ పోటీలు, కళాకారులతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మైనార్టీ మహిళలపై
అశ్లీల వీడియో వైరల్
● పోలీస్స్టేషన్ను ముట్టడించిన ప్రజలు
● లింగసూగూరులో గట్టి పోలీస్ బందోబస్తు
రాయచూరు రూరల్: లింగసూగూరులో రాజు తంబాకు అనే ఆరెస్సెస్ కార్యకర్త సామాజిక మాధ్యమాల్లో మైనార్టీ మహిళలపై పోస్ట్ చేసిన అసభ్యకరమైన వీడియో వైరల్ కావడంతో గురువారం రాత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బేబీ ఫ్యాక్టరీ పేరుతో పోస్టులో రాజు తంబాకు మొబైల్లో స్టేటస్ పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ సోదరులు ఏకంగా మైనార్టీ మహిళలను నిందించారనే ఆరోపణలతో స్టేషన్ ముందు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. కాగా లింగసూగూరు డీఎస్పీ వేణుగోపాల్ వెంటనే జోక్యం చేసుకుని అశ్లీల వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
చెరువుల పునశ్చేతనం అవసరం
రాయచూరు రూరల్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నందున అధికారులను చెరువుల పునశ్చేతనానికి చర్యలు చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ మోతీరామ్ పేర్కొన్నారు. శుక్రవారం సిరవార తాలూకా చాగబావిలో చెరువును ఆయన పరిశీలించారు. శాస్త్రి క్యాంప్, జాలాపూర్ క్యాంప్ల్లో అమృత్ సరోవర్ మిషన్ ద్వారా చేపట్టిన పథకాలను విశ్లేషించారు. అనంతరం నరేగ పథకం కింద పనులు చేస్తున్న వ్యవసాయ కూలీ కార్మికులతో సంవాదం జరిపారు. ఆయన వెంట జెడ్పీ డీడీ ప్రకాష్, ఇంజినీర్లు హీరాలాల్, వెంకటేష్, శర్ఫీనుషా బేగం, సోమనాథ్, పీడీఓ ప్రసాద్లున్నారు.