
చికిత్స పొందుతున్న బాధితులు
రాయచూరు రూరల్: నగరంలోని హరిజనవాడలో వెలసిన కంచు మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. గురువారం రాత్రి ఆలయం వద్ద శాంతమల్ల శివాచార్య స్వామీజీ, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కు తీర్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో
మరొకరి మృతి
● 11కు పెరిగిన మృతుల సంఖ్య
● ఇంకా తేరుకోని సంగనకల్లు
సాక్షి,బళ్లారి: మూడు రోజుల క్రితం మైసూరు సమీపంలోని టీ.నరసీపుర వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తాలూకాలోని సంగనకల్లు గ్రామానికి చెందిన 9 మందితో పాటు ఇన్నోవా కారు డ్రైవరుతో కలిపి 10 మంది మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి మైసూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీరిలో సందీప్ అనే యువకుడు శుక్రవారం మృతి చెందడంతో మృతుల సంఖ్య 11కు చేరింది. గ్రామానికి చెందిన మూడు కుటుంబాల వారు విహారయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ విషాదం నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు.
నేటి నుంచి జిల్లాలో
మంత్రి పర్యటన
రాయచూరు రూరల్ : నగరానికి చెందిన చిన్న నీటిపారుదల, సైన్స్ టెక్నాలజీ శాఖా మంత్రి బోసురాజు శనివారం నుంచి జిల్లాలో చేపట్టనున్న పర్యటన ఖరారైంది. శుక్ర వారం రాత్రి మంత్రాలయంలో బస చేసి శనివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయనకు సన్మానం చేస్తారు. మధ్యాహ్నం దేవదుర్గ తాలూకా రేకల మరడిలో అతిసార బాధితులను పరామర్శిస్తారు. ఆదివారం లింగసూగూరు, మస్కిల్లో, సోమవారం నగరంలోని మున్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో చేపట్టే ఎద్దుల పోటీల ప్రారంభోత్సవం, 11 గంటలకు జెడ్పీ సభాభవనంలో సమావేఽశంలో మంత్రి పాల్గొంటారని ప్రకటనలో తెలిపారు.
కలుషిత ఆహారం తిని 20 మందికి అస్వస్థత
సాక్షి,బళ్లారి: కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతకు గురైన ఘటన విజయపుర జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం చడచణ తాలూకా డోణ గ్రామానికి చెందిన వారు మొక్కు తీర్చుకునేందుకు ఆళంద తాలూకా లాడ్లే మషాక్ దర్గాకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని దర్గా వద్దే సామూహికంగా తిన్నారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికి ఒకరి తర్వాత మరొకరికి వాంతులు, విరేచనాలు కావడంతో భక్తులంతా దర్గా వద్దనే కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెంది వెంటనే వారిని ఆళందలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యుడు ప్రమోద్ తక్షణం స్పందించి చికిత్స చేయగా ప్రస్తుతం అందరూ కోలుకుంటున్నారని తెలిపారు.
అతిసారతో 20 మందికి అనారోగ్యం
రాయచూరు రూరల్: కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం లింగసూగూరు తాలూకా యర్రగుంటలో జరిగింది. అనారోగ్యం బారిన పడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజులుగా గ్రామంలోని శుభ్రం చేయని నీటి ట్యాంక్ నుంచి సరఫరా అయిన కలుషిత నీటిని తాగడంతో వాంతులు, విరేచనాలతో ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఉదంతంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా బాధితులను తహసీల్దార్ జామదార్, డీహెచ్ఓ సురేంద్రబాబు, టీహెచ్ఓ, పీడీఓ, పంచాయతీ అధికారి రామకృష్ణ పరామర్శించారు.
సఫాయి కర్మచారుల ధర్నా
కోలారు: తమ వివిధ డిమాండ్ల సాధన కోసం సఫాయి కర్మచారులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాన్యువల్ స్కావెంజర్ల నియామకాలను నిషేధించాలని, పునర్వసతి– 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉద్యోగం, సహాయధనం అందించాలని, 60 ఏళ్లు పైబడిన వారికి రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ధర్నాలో కావలు సమితి రాష్ట్ర సంచాలకురాలు ఎం.పద్మ, జాగృతి ఇన్ఛార్జి సమితి సభ్యుడు లక్ష్మీసాగర్, వెంకటరాం తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో కలిసి ఉత్సవంలో పాల్గొన్న శాంతమల్ల శివాచార్య స్వామీజీ

మంత్రి బోసురాజు