ఖాళీ కుర్చీలపై మండిపాటు
కేజీఎఫ్: పాలనాధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా నగరసభకు వచ్చిన ఉప విభాగాధికారిణి వెంకటలక్ష్మికి కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో ఆమె అధికారులపై మండిపడ్డారు. నగరసభలో విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కార్యాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన నగర ప్రజలు నగరసభలో అధికారులు, సిబ్బంది ప్రజా పనులపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, సిబ్బందితో పాటు కమిషనర్ కూడా కార్యాలయంలో కనిపించరని, వీరిని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. స్పందించిన ఆమె నగరసభ కార్యాలయంలో ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని సరి చేసి పాలనను గాడిలో పెడతానని హామీ ఇచ్చారు.