
బెల్లం పాకం తయారు చేస్తున్న దృశ్యం
గౌరిబిదనూరు: తీయటి పదార్థం తింటే నోటికే కాదు మనస్సుకు సంతృప్తి ఉంటుంది. తీపి లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. ఎంతో ఆరోగ్యాన్ని కలిగించే, నాణ్యమైన బెల్లం తయారీలో గౌరిబిదనూరు తాలూకా రాష్ట్రంలోనే పేరుగాంచింది. పరంపరగా కొనసాగిన బెల్లం తయారీ 1960–70 వరకు చెరకు పండించడానికి ఎంతో అనువుగా ఉండేది. దీన్ని చూసి చక్కెర ఫ్యాక్టరీని స్థాపించారు. అడవులు నశించి వర్షాలు తగ్గి చెరకు వేసే రైతులు చాలా వరకు తగ్గిపోయారు. దీంతో ఫ్యాక్టరీ సైతం మూతపడింది.
దారినాయకన పాళ్య హోబళీలో
బెల్లం తయారీ
గత ఏడాది వర్షాలు బాగా పడినందున తాలూకా దారినాయకన పాళ్య హోబళీలోని నామగొండ్లు, బెల్లాళబోమ్మసంద్ర, ఎర్రనాగేనహళ్లి, చీలంనహళ్లి, చించానహళ్లి తదితర గ్రామాలలో రైతులు చెరకు పండించి బెల్లం తయారు చేస్తూ వున్నారు. ఇక్కడ చెరకు పండించడానికి భూమి చాలా అనువైనదని చీలంనహళ్లి బెల్లం తయారీ రైతు సీఎన్ నరసింహారెడ్డి తెలిపారు. తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో చెరకు పండించి 25 రోజుల పాటు బెల్లం గానుగను పెట్టినట్లు తెలిపారు. నేటి రోజులలో నాణ్యత కల బెల్లం ఉత్పాదనకు కార్మికుల సమస్యగా వుంది. బాగా అనుభవం వున్న వారిచే బెల్లం ఉత్పత్తి చేయించాలి. గతంలో ఎద్దుల ద్వారా గానుగను తిప్పి చెరకు రసం తీసేవారు. ప్రస్తుతం కరెంటు మోటార్ల ద్వారా చెరకు రసం తీసి కొప్పెర్లలో వేసి వేడి చేసి దానికి తగిన పాకం వచ్చినపుడు వంటసోడా, సున్నం, చెక్క, వేరుశెనగ నూనెను తగిన పాళ్లలో కలపాల్సి ఉంది. ఆర్గానిక్ బెల్లం తయారీకి వీటిని వెయ్యకుండా కేవలం సున్నం మాత్రం కలుపుతారని నరసింహారెడ్డి తెలిపారు.
ఉంటలు చేయడం కళ
బెల్లం తయారైన పిదప దానిని ఉంటలుగా చేయడం సైతం ఒక కళగా చెప్పవచ్చు. తాలూకాలో అచ్చు బెల్లాన్ని తయారు చేయరు. లాభం రాని, నష్టం రాని పరంపరగా వస్తున్న ఈ బెల్లం ఉత్పాదనను విడువలేక పోతున్నామని ఇక్కడి రైతులు అంటున్నారు.
గౌరిబిదనూరు తాలూకాలో
కనుమరుగవుతున్న బెల్లం తయారీ యూనిట్లు
నాడు బెల్లం తయారీలో నంబర్ వన్
చెరకు ఫ్యాక్టరీ మూతతో రైతుల అవస్థలు
సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకుని తాలూకాలో బెల్లం ఉత్పాదనకు పూర్వ వైభవం రావాలి. చెరకు విత్తనాలు, దానికి సంబంధించిన అన్ని విషయాలు వ్యవసాయ శాఖలో తెలుసుకోవాలి. – మోహన్,
వ్యవసాయ శాఖాధికారి

ఉంటల బెల్లం