పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి
● సీఎంను కలిసిన కాంట్రాక్టర్ల సంఘం
శివాజీనగర: బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 శాతం కమీషన్ ఆరోపణ చేసిన కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ నేతృత్వంలోని కాంట్రాక్టర్ల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను భేటీ చేసింది. పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేయాలని కోరింది. గ్రామీణ నీటి సరఫరా, ప్రజాపనుల శాఖ, గ్రామీణాభివృద్ధితో పాటుగా వివిధ బోర్డు, కార్పొరేషన్ల పనులను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయించింది. బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. దీంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. దీంతో కాంట్రాక్టర్లు తమ సంఘం ఆధ్వర్యంలో సీఎంను కలిసి సమస్యలు విన్నవించారు. బిల్లులు నిలిచిపోవడంతో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఆటంకం ఏర్పడుతోందని, పనులు కొనసాగేందుకు ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు.