నేటి నుంచి సంస్కృత పాఠశాల ప్రవేశాలు షురూ

కంప్లి: పట్టణంలోని సంగత్రాయ సంస్కృత పాఠశాలలో 2023–24వ విద్యా సంవత్సరానికి గాను వైదిక, జ్యోతిష్య బోధన తరగతుల ప్రారంభానికి ఈ నెల 25 నుంచి ప్రవేశాలు ప్రారంభం అవుతాయని, జూన్ 5లోగా ప్రవేశానికి పేర్లు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపాల్ ఘనమఠదయ్య హిరేమఠ తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ప్రవేశానికి కేవలం జంగమ సముదాయానికి చెందిన కనీసం 10వ తరగతి పాసైన, 16 ఏళ్లు పైబడిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను దరఖాస్తుతో పాటు అందించాలని, వివరాలకు పాఠశాల అధ్యక్షులు ఎస్ఎస్ చెన్నయ్యస్వామి, 9480464900 లేదా ప్రిన్సిపాల్ 8105566870 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
కారు రేసింగ్.. నలుగురి అరెస్ట్
యశవంతపుర: కారు రేసింగ్ చేస్తున్న నలుగురిని దక్షిణకన్నడ జిల్లా కాపు పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యావరకు చెందిన అయాన్(24), కుంజిబెట్టుకు చెందిన మిశాల్వుద్దీన్(23), ఉడుపికి చెందిన శానూన్ డిసోజా(25), వివేక్(23)లను అరెస్ట్ చేశారు. కారు రేసింగ్కు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. వీడియోను పోలీసులు పరిశీలించగా మూడబెట్టు–మూళూరు మార్గంలో కారును నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
వైభవంగా ఓంశక్తి ఆలయ వార్షికోత్సవం
మాలూరు: తాలూకాలోని ఆలంబాడిలో భక్తులు నూతనంగా నిర్మించిన ఓంశక్తి ఆలయ మొదటి సంవత్సర వార్షికోత్సవ వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు బీఆర్ వెంకటాచలపతి నేతృత్వంలో గోపూజ, గంగపూజ, మృత్యంగ్రహణ, యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధన, అంకురార్పణ, గణపతి, శాంతి హోమం, మహా పూర్ణాహుతి, కలశ విసర్జన తదితర పూజలను జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పోలీసులు కేసరి శాలువా ధరిస్తే తప్పేమిటి?
● విజయపుర ఎమ్మెల్యే
బసనగౌడ పాటిల్ యత్నాళ్
శివాజీనగర: పోలీసులు కేసరి దుస్తులు ధరిస్తే తప్పేమిటని విజయపుర విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ ప్రశ్నించారు. తుమకురు జిల్లా, క్యాతసంద్ర పోలీస్ స్టేషన్లో సిబ్బంది కేసరి షర్ట్, తెల్ల పంచె ధరించి తీసుకున్న ఫొటో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ శాఖను కేసరీకరణ చేయటానికి ప్రయత్నిస్తున్నారా? అని సీనియర్ పోలీస్ అధికారుల సభలో డీసీఎం డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన బసనగౌడ పాటిల్ యత్నాళ్... డీ.కే.శివకుమార్ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లను పచ్చరంగుగా మారుస్తారా? పాకిస్తాన్ చేయటానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. పోలీసులు కేసరి శాలువా వేసుకుంటే తప్పేమిటని కాంగ్రెస్ను ప్రశ్నించారు.
నకిలీ జామీను పత్రాలు అవాస్తవం
కేజీఎఫ్: తాను కోర్టుకు నకిలీ దాఖలాలు సృష్టించి జామీను పొందానని వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని దక్షిణాసియా మానవ హక్కుల సమాఖ్య చైర్మన్ డాక్టర్ ఎల్.బాబు స్పష్టం చేశారు. బుధవారం కోలారులోని పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. తాను రూ.50 వేల లంచాన్ని డిమాండ్ చేసినట్లు కేజీఎఫ్ ఆర్టీఓ కార్యాలయ అధికారి వి.మురళీధర్ కేజీఎఫ్ కోర్టులో 2021లో బనాయించిన తప్పుడు కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో తనకు, జామీనుదారుకు ఎలాంటి సంబంధం లేదు. తాను, తన న్యాయవాదికి ఫీజు చెల్లించానని, అతనే తనకు జామీనుదారును తీసుకు వచ్చి కోర్టుకు దాఖలాలు సమర్పించారన్నారు. కేసుకు సంబంధించి తనకు ఇచ్చిన జామీను రద్దు చేసినట్లు కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. వచ్చినా తాను వేరే ష్యూరిటీ ఇచ్చి జామీను పొందగలనన్నారు. తాను కోర్టును ఎప్పుడూ వంచన చేయలేదన్నారు.