● ఉమ్మడి జిల్లాలో 20 పాఠశాలల ఎంపిక ● 3వ తరగతి పిల్లల అభ్యసన సామర్థ్యాల అంచనా ● నేటితో సర్వే పూర్తి
కరీంనగర్టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా ఢిల్లీలోని పరఖ్ (ఫర్మార్మెన్స్ ఎసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవెలప్మెంట్) ఎన్సీ ఈఆర్టీ వారు ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ) సర్వే నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 20 పాఠశాలలను ఎంపిక చేశారు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన, సామర్థ్యాల పరిశీలన, అవగాహనా నైపుణ్యాలను ఎలా ఉన్నాయి అనే అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సర్వే మంగళవారంతో ముగియనుంది. కరీంనగర్ జిల్లాలో 8 పాఠశాలలు, రాజన్న సిరిసిల్లలో 3, పెద్దపల్లిలో 3, జగిత్యాల జిల్లాలో 6 పాఠశాలలు ఎంపిక చేశారు. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎన్)లో భాగంగా జాతీయ స్థాయిలో 3వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాల నుంచి మూడో తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. కరీంనగర్లోని ఎల్ఎండీలో గల డైట్ కళాశాలకు చెందిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులను ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. కోర్సు కోఆర్డినేటర్, ఏఎంఓ కర్ర అశోక్ రెడ్డి, డైట్ ప్రిన్సిపల్ మొండయ్య ఆధ్వర్యంలో సర్వే బృందం శిక్షణ పూర్తి చేశారు. వివరాలను కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలకు అందించనున్నారు.


