కరీంనగర్ అర్బన్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సీజన్లో 2,73,550ఎకరాల్లో వరి సాగైందని, 6,46,320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని వివరించారు. 3,67,776 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశముందని, జిల్లాలో ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్, హాకా ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాలు, కో–ఆపరేటివ్, డీఆర్డీవో, మార్కెటింగ్ తదితరశాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డీఎం ఎం.రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజాచార్య, డీఎంవో షాబోద్దీన్ పాల్గొన్నారు.
పారదర్శకమైన ఓటరు జాబితాకే ఎస్ఐఆర్
ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో అవగాహన సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో డూిప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్లవి తొలగిస్తారని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఓటు హక్కు రానివారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు.
గ్యాస్ గోదాం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి గ్యాస్ సరఫరా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. నగరంలోని సీతారాంపూర్లో గల నిర్మల భారత్ గ్యాస్ ఏజెన్సీ గోదాంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులకు సరఫరా అవుతున్న సిలిండర్లు, వాణిజ్యపరమైన, గృహ అవసరాల సిలిండర్ల సరఫరా వివరాలు పరిశీలించారు. స్టాక్, బుకింగ్ సంఖ్య తదితర వివరాలను ఎప్పటికప్పుడు పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి తెలియజేయాలని డీలర్లకు సూచించారు.


