కరీంనగర్: నగరంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన హజ్ కమిటీ ట్రైనింగ్ అండ్ వ్యాక్సినేషన్ క్యాంప్ను డీఎంహెచ్వో వెంకటరమణ, పీవో ఎంహెచ్ఎన్ డాక్టర్ సనా జవేరియా మంగళవారం సందర్శించారు. హజ్ యాత్రకు వెళ్లనున్న 139మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ చేశారు. 60 సంవత్సరాల పైబడిన వారికి ఎస్ఐవీ, మొనోకోకల్ మెనింజైటిస్ (క్యూఎంఎంవీ) టీకాలు ఇచ్చారు. 60ఏళ్లలోపు వారికి ఒక్కటే టీకా ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సాజిద్, డిప్యూటీ డీఎంహెచ్వో రాజగోపాల్, మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, హెల్త్ ఎడ్యుకేటర్ సరస్వతి, హజ్ కమిటీ సభ్యులు అజహార్, రియాజ్ అలీ, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
నార్మల్ డెలివరీలపై దృష్టి
జిల్లాలోని పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో ఆశా ఫెసిలిటేటర్లతో సమీక్షించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా పనితీరును సమీక్షిస్తూ, మొదటి కాన్పులకు గర్భిణులను సాధారణ ప్రసవాల వైపు ప్రోత్సహించాలని తెలిపారు. తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను, తక్కువ బరువు పిల్లలను గుర్తించి, పోషకాహార పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆర్బీఎస్కే, 102 వాహనాలను వినియోగించాలన్నారు.


