భీమన్న గుడిలో మహాజాతర
జాతర మహోత్సవాలు మహోన్నతంగా నిర్వహిస్తాం
వేములవాడ: మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ఈ యేడు భీమన్న ఆలయంలో నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండడంతో ఈసారి భీమేశ్వరస్వామి ఆలయంలోనే శివరాత్రి మహాజాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయ చరిత్రలో తొలిసారి
రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో దర్శనాలు, మొక్కులకు భీమన్న ఆలయానికి గత అక్టోబర్ 11న మార్చారు. దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు ప్రచారరథంలో స్వామి వారిని దర్శించుకుని, భీమన్న గుడిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈనెల 14, 15, 16 తేదీల్లో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఉన్నందున భీమన్న ఆలయంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో రాజన్న ఆలయ చరిత్రలోనే మొదటిసారి ఉత్సవాల వేదిక మారింది.
భక్తుల సౌకర్యమే లక్ష్యం
హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆలయం మరింత వైభవంగా రూపుదిద్దుకునే దిశగా రూ.150కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులతో ప్రధాన ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ, భద్రత సమస్యల దృష్ట్యా భీమన్న ఆలయాన్ని జాతర వేదికగా ఎంపిక చేశారు. ఆమేరకు గత డిసెంబర్ 30న జాతర సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు
మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో గుడి చెరువు పార్కింగ్ స్థలంతోపాటు భీమన్న ఆలయం వద్ద తాత్కాలిక షెడ్లు, క్యూలైన్లు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
దర్శనాలు ఇలా..
● ఈనెల 14, 15, 16 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాజరాజేశ్వరస్వామికి ఏకాంతంగా సేవలు నిర్వహిస్తూనే భీమన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్శర్మ తెలిపారు.
భీమన్న ఆలయంలో...
● 14న ఉదయం 7.30 గంటలకు టీటీడీ ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ.
● 15న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పట్టువస్త్రాల సమర్పణ.
● 14న రాత్రి 11.30 నుంచి 15న తెల్లవారుజాము 3.30 గంటల వరకు పట్టణ ప్రజలకు దర్శనాలు.
● 15న ఉదయం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులకు దర్శనాలు.
● 15న సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివదీక్షా స్వాములకు దర్శనాలు.
● 15న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో మహాలింగార్చన.
● 15న రాత్రి 11.35 గంటల నుంచి లింగోద్భవ కాలంలో స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం.
కొనసాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు
ఏర్పాట్లు చేసిన అధికారులు
ఈనెల 14 నుంచి ఉత్సవాలు
మహా శివరాత్రి జాతర మహోత్సవాలను ఈసారి భీమేశ్వరాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పలుమార్లు పనులు పరిశీలించాం. వివిధ శాఖలకు అప్పగించిన పనులపై సమీక్షిస్తూ పరిశీలిస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పిస్తున్నాం.
– గరీమా అగ్రవాల్, కలెక్టర్,
ఉత్సవ కమిటీ చైర్పర్సన్
భీమన్న గుడిలో మహాజాతర
భీమన్న గుడిలో మహాజాతర


