ఐదేళ్లలో గ్రేటర్ కరీంనగర్
మౌలిక వసతులకు ప్రాధాన్యం
బల్దియాను బలోపేతం చేసి అప్గ్రేడ్ చేస్తాం
ఓఆర్ఆర్తో పెరగనున్న పరిశ్రమలు, వలసలు
మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి
50 సీట్లతో విజయదుందుబి మోగిస్తాం
మజ్లిస్తో కాంగ్రెస్కు ఎలాంటి పొత్తు లేదు
గంగుల– సంజయ్ ఒక్కటైనా ఓడించలేరు
‘సాక్షి’తో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి
వెలిచాల రాజేందర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
‘కరీంనగర్ కార్పొరేషన్ను ఐదేళ్లలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేస్తాం.. కరీంనగర్కు త్వరలో రానున్న ఔటర్ రింగ్రోడ్డుతో నగర రూపురేఖలు మారనున్నాయి. సంక్షేమ పథకాలే మా పార్టీని గెలిపిస్తాయి. ప్రతీ ఇంట్లో కాంగ్రెస్ ప్రజాపాలన లబ్ధిదారులు ఉండటం మాకు కలిసి వచ్చే అంశం. అందుకే, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 50పైగా సీట్ల తో విజయదుందుబి మోగిస్తాం. మజ్లిస్ పార్టీతో మాకు ఎలాంటి పొత్తు లేదు. ముస్లింలు, దళితులు మా సంప్రదాయ ఓటు బ్యాంకు. వారెప్పుడూ మాతోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ–బీఆర్ఎస్ చీకటి ఒప్పందంతో చేతులు కలిపాయి. కాంగ్రెస్ను ఓడిచేందుకు కరీంనగర్లో గంగుల– బండి జతకలిశా రు. అయినా మా పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అని ‘సాక్షి’తో కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ అన్నారు.
స్మార్ట్సిటీ పేరిట దోపిడీ
నగరంలో స్మార్ట్సిటీ పేరిట రూ.వందల కోట్లు ప్రజాధనం దోపిడీ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి సంజయే చెప్పారు. తీవ్ర అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను, అవినీతి అనకొండలను బీజేపీలోకి ఎలా ఆహ్వానిస్తారు?. బీఆర్ఎస్– బీజేపీ చేతులు కలిపాయనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? అందుకే, ఇద్దరు కలిసినా హస్తం పార్టీని ఓడించలేరని బండి సంజయ్, గంగుల కమలాకర్కు సవాలు విసురుతున్నా. ఆ రెండు పార్టీల్లో కార్పొరేటర్లు బెయిల్ మీద ఉండి పోటీ చేస్తుండటం బీజేపీ– బీఆర్ఎస్ అవినీతి విధానాలకు అద్దం పడుతోంది. మానేరు రివర్ ఫ్రంట్, తీగల వంతె న నిర్మాణాల్లో లోపాలు, ఖర్చులో అవకతవకలపై విచారణ జరిపిస్తాం. అధ్యయనం అనంతరం ప్రాజెక్టులను పునరుద్ధరిస్తాం.
నగరంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తాం. ముఖ్యంగా గత పాలకమండలి ముస్లిం, దళితవాడలలో సదుపాయాలకు పెద్దపీట వేస్తాం. నగరాభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కీలక పాత్ర పోషించనుంది. ఔటర్ వెలుపల ఏర్పాటయ్యే పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు వచ్చి, వలసలు పెరుగుతాయి. ఐదేళ్లలో ఇప్పుడున్న 4లక్షల జనాభా కాస్తా.. 6 నుంచి 7 లక్షలు దాటుతుంది. నగర ఆర్థికాభివృద్ధి కూడా మెరుగుపడగానే.. గ్రేటర్ నగరంగా అప్గ్రేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి మాటిచ్చినట్లుగా డంపింగ్యార్డు సమస్య తీరుస్తాం. నగరం మొత్తానికి 24 గంటల తాగునీరు అందజేస్తాం. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను తీర్చిదిద్దాం. సోనియా సైనికులుగా, సీఎం రేవంత్ అనుచరులుగా కరీంనగర్ బల్దియాపై మూడురంగుల జెండా ఎగరేస్తాం.


