బీజేపీ, కాంగ్రెస్ అభివృద్ధి నిరోధక పార్టీలు
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్టౌన్: బీజేపీ, కాంగ్రెస్లు అభివృద్ధి నిరోధక పార్టీలని, అభివృద్ధి కావాలో, విధ్వంసం కావాలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం 21,47వ డివిజన్ల అభ్యర్థులు చల్లా హరిశంకర్, స్వరూపారాణిలకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు జనరంజక పాలన సాగించామని గుర్తు చేశారు. కులాల పేరిట పెనుగులాటలు, మతాల పేరిట మారణహోమాలు, వర్గాల పేరిట విభజించి పాలించడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. అనంతరం 17,18వ డివిజన్ల అభ్యర్థులు రుద్ర నవిత, జమీలోద్దిన్కు మద్దతుగా ప్రచారం చేశారు. రెండేళ్లలో కాంగ్రెస్, బీజేపీలు 2 రూపాయల అభివృద్ధి చేయలేదని, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్కు, సెంటిమెంట్తో ఓట్లు దండుకునే బీజేపీకి ప్రజల చీత్కారం తప్పదని హెచ్చరించారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు డబ్బుల సంచులతో ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారని, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. అలాగే 16,37,4,5వ డివిజన్ల అభ్యర్థులు బెజ్జంకి అయిలయ్య, గాదె స్వరూప, రామచంద్రం తదితరులకు మ ద్దతుగా రోడ్ కార్నర్ నిర్వహించారు. హరీశ్రావు, రుద్ర రాజు, శ్రీనివాస్, శ్రీనివాస్గౌడ్, గంగాధర చందు, మల్లేశం పాల్గొన్నారు.


