దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య
వీర్నపల్లి(సిరిసిల్ల): ఉపాధి కోసం ఏడాది క్రితం గల్ఫ్ వెళ్లిన యువకుడు అక్కడ తనువు చాలించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో విషాదం నింపింది. మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్ (22) దుబాయ్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాకేశ్ ఇంటి ఆర్థిక పరిస్థితులు బాగా లేక, ఇంటి నిర్మాణానికి చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చేందుకు దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆశించిన స్థాయిలో జీతం రాకపోవడం, అప్పులు తీరే మార్గం కనిపించక కొంతకాలంగా మానసిక వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందిన కొడుకు విగతజీవిగా మారాడన్న వార్త విన్న తల్లి లక్ష్మి, సోదరుడు సతీశ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సర్పంచ్ సామర్ల దేవరాజు, వడ్డెర సంఘం నాయకులు గోగుల రమేశ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని టీఆర్నగర్కు చెందిన షేక్ నయూం(43) ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నయూం ఈనెల 6న సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. తల్లి జరీనాబేగం ఈనెల 7న రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో నయూం నర్సింగాపూర్ శివారు ఎస్సారెస్పీ కాలువలో శవమై కనిపించాడు. నయూంకు భార్యతో కొద్దికాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తల్లి వద్దే ఉంటున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు.
గుండెపోటుతో వృద్ధుడి మృతి
కొడిమ్యాల(చొప్పదండి): మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వృద్ధుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి గ్రామానికి చెందిన చిన్న శంకరయ్య అనే వృద్ధుడు అస్వస్థతకు గురైన అతన్ని చికిత్స కోసం హాస్పిటల్కు తీసుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తుండగా కొడిమ్యాల బస్టాండ్ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్న్స్కు స్థానికులు సమాచారం అందించగా 108 సిబ్బంది శంకరయ్యను పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
దుబాయ్లో కంచర్ల యువకుడి ఆత్మహత్య


