త్రిముఖ పోరు.. ప్రచార జోరు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మున్సి‘పోల్స్’ అన్ని పార్టీల నుంచి రంగంలోకి ప్రధాన నేతలు అభ్యర్థుల గెలుపుకోసం పోటాపోటీగా ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు రసవత్తరంగా మారిన మున్సిపల్ ఎన్నికలు ప్రచారానికి నేటితో తెర
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: జిల్లాలో రాజకీయ ప్రముఖుల మకాం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు గల్లీ.. గల్లీలో పర్యటనలు.. చౌరస్తాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు.. మైకుల్లో దద్దరిల్లే వాగ్దానాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు.. ఇంటింటా ప్రచార జోరుతో మున్సిపల్ ఎన్ని కల ప్రచారం తారాస్థాయికి చేరింది. ప్రచార ముగింపునకు మరి కొద్ది గంటలే సమయం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు.. మద్దతుదారులు చెమటోర్చుతున్నారు. జిల్లాలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుండగా.. సింహం గుర్తుతో బరిలో నిలిచిన వారితో పాటు పలువురు స్వతంత్రులు సైతం గట్టి పోటీనే ఇస్తున్నారు.
మూడు పార్టీల దూకుడు
కరీంనగర్ కార్పొరేషన్తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. కొద్దిరోజుల నుంచి నుంచి అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్యనేతలు డివిజన్ల వారీగా స్ట్రీట్కార్నర్ మీటింగ్లతో గల్లీగల్లీల్లో ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి 50 నుంచి 100 మంది కార్యకర్తలను వెంటేసుకొని ఇంటింటా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. మున్సిపాలిటీలను కై వసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలతో పాటు రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలను ప్రచారంలో అస్త్రాలుగా చేసుకుంటున్నాయి.


