కేంద్ర మంత్రిగా ‘బండి’ అట్టర్ ప్లాప్
కరీంనగర్ టౌన్: ఎంపీగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఏడేళ్లలో ఎంపీ నిధులు తప్ప ప్రత్యేకంగా ఏ ఒక్క పని చేయలేదని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకుని బుక్లెట్లు ముద్రించి, ప్రజలకు పంచడం సిగ్గుచేటని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన నివాసంలో మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్సిటీకి ఎంపికై ననప్పుడు బండి సంజయ్ కార్పొరేటర్ మాత్రమేనని గుర్తు చేశారు. కరీంనగర్ అభివృద్ధిపై బండి ముద్రించిన బుక్లెట్లో ఆయన చేసిన పని ఒక్కటీ లేదన్నారు. సీఎం ప్రత్యేక నిధులు, స్మార్ట్సిటీ నిధులతో కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దామని, కూడళ్లు, విశాలమైన రోడ్లు, తీగలవంతెన రూ.కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కరీంనగర్ అభివృద్ధికి ఏడేళ్లలో ఒక్క జీవో కాపీనైనా చూపాలని సవాల్ విసిరారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీ పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం కరీంనగర్ గడ్డమీద అభివృద్ధి జెండా అనే వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు
కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం 25వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాడే రాజ్కుమార్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండేళ్లలో చేసింది శూన్యమన్నారు. అనంతరం 24వ డివిజన్ బ్యాంక్ కాలనీలో సీనియర్ సిటిజన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆ డివిజన్ అభ్యర్థి గండ్ర రఘునాథరావుకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు.


