కరీంనగర్లో చేతులెత్తేసిన కాంగ్రెస్
కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం రావడంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారి ఒప్పదం చేసుకుందన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నగరంలోని 10,11,55,37,48,21,22 డివిజన్ల అభ్యర్థులు డి.శంకర్, పండుగ స్వప్న, గుగ్గిళ్లపు మంజులరమేశ్, కోడూరి ఏపీపీ చంద్ర టింకు, కర్ర పద్మ, కొండపల్లి సతీశ్, బండ రమణారెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించి బుక్లెట్ ఇంటింటికీ పంపిస్తుంటే, బీఆర్ఎస్వాళ్లు ఇప్పుడు కరపత్రం ప్రచురించి తామే కేంద్రం నుంచి నిధులు తెచ్చామని చెప్పడం సిగ్గు చేటన్నారు. తాను నిధులు తెస్తే, గంగుల కమలాకర్ మనుషులు కబ్జాలు చేయడం తప్ప చేసిందేమి లేదన్నారు.
ముస్లింలకు నేను వ్యతిరేకం కానేకాదు
తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లింలను వెనుకబాటుకు గురిచేస్తున్న ఎంఐఎం పార్టీకి వ్యతిరేకినని సంజయ్ అన్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటిలోనూ ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారన్నారు. పేదరికంలో ఉన్న ముస్లింలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ముస్లిం మహిళల బాధలు చూసి ట్రిపుల్ తలాఖ్ రద్దు చేశామని గుర్తు చేశారు.


