పరీక్షల కాలం.. ఆరోగ్యం పైలం!
కరీంనగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగిని లక్ష్మి కుమారుడు పదోతరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. పరీక్షలంటే కుమారుడి కన్నా తల్లికే ఎక్కువగా ఆందోళన ఉంది. పిల్లాడు ఒత్తిడికి, ఆందోళనకు గురికాకుండా, ఆరోగ్యంపై దుష్ప్రభావం పడకుండా చూసుకోవడం లక్ష్మికి పెద్ద సవాలే.
జమ్మికుంటకు చెందిన స్నేహకు భయమెక్కువ. పరీక్షలంటేనే వణికిపోతుంది. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతోంది. కొద్దిరోజుల్లో బోర్డు పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. స్నేహకు తల్లిదండ్రులు ధైర్యం చెబు తున్నారు. అయినా భయం పోవడం లేదు. చదివింది గుర్తుండటం లేదు. పరీక్షల సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందోనని స్నేహ ఆందోళన చెందుతోంది.
హుజూరాబాద్/ కరీంనగర్ స్పోర్ట్స్: ప్రస్తుతం పరీక్షల కాలం.. మరో 20 రోజుల్లో ఇంటర్, 40 రోజుల్లోపు పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు విజయం సాధించాలంటే ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పట్టాలి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిల్లల్లో నిశ్శబ్ధం మొదలవుతుంది. గుండెల్లో వేగం పెరుగుతుంది. కళ్లు మూసినా.. తెరిచినా పుస్తకాలే కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చదివింది గుర్తుపెట్టుకోవడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో ఏది పడితే అది తింటే ఆరోగ్యంపై ప్రభావం చూపు తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టడం సరికాదని సూచిస్తున్నారు. పరీక్షల కాలంలో ఆరోగ్యం పైలంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.
రాత్రంతా చదవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మెదడుకు ఎక్కదు. అనవసర ఆందోళనకు కారణమవుతుంది.
రోజూ కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర తప్పనిసరి.
ఎంత ప్రణాళిక వేసుకున్నా.. సరే.. కొందరికి పరీక్షలంటే భయం ఇలాంటి వారితో పెద్దలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి.
పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, డీప్ఫ్రైడ్ ఆహారం ఇవ్వకూడదు. బయట నుంచి ఆహారం పూర్తిగా తగ్గించాలి.
అల్పాహారం తప్పకుండా ఇవ్వాలి. చిరు ధాన్యాలతో చేసిన ఆహారం, పండ్ల ముక్కలు, గుడ్డు, పాలు అందించాలి.


