గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్‌ | - | Sakshi
Sakshi News home page

గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్‌

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

గుమ్ల

గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్‌

నేడు రాక.. భారీ బహిరంగ సభ

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

40 వేల మంది జన సమీకరణ

పరిశీలించిన ఇన్‌చార్జి మంత్రి తుమ్మల, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/చొప్పదండి:

జిల్లాలో నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని గుమ్లాపూర్‌ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రామడుగు మండలం వెదిరలో అడ్వాన్స్‌డ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌, గంగాధరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, దత్తోజుపేటలో సోలా ర్‌ ప్లాంటు ఏర్పాటుతో పాటు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను సభావేదికగా అందించనున్నా రు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి జన సమీకరణ జరపనున్నారని సమాచారం. సుమారు 40వేల మందితో సభ నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లక్ష్యంగా పెట్టుకున్నారు. సభకు ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు పొన్నం ప్రభా కర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా ఇన్‌చార్జిమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హాజరు కానున్నారు. సభ కోసం చొప్పదండి నుంచి రామడుగు వెళ్లేదారిలో గుమ్లాపూర్‌ శివారులో వేదికను సిద్ధం చేశారు. బుధవారం ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్థానిక ఎమ్మెల్యే సత్యం, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మున్సిపల్‌లో పట్టం కట్టండి: మంత్రి తుమ్మల

కేంద్రం సహకరించకపోయినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుండైధెర్యంతో అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సభా ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ.. మెట్ట నియోజకవర్గం అయిన చొప్పదండికి నీటి వసతులు, కళాశాల ప్రారంభం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరుగుతోందన్నారు. పనికి మాలిన విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయయాత్ర కొనసాగుతోందన్నారు. అభివృద్ధి చేసేవారికే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు.

వరద కాలువకు సాగునీరు: మేడిపల్లి

చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు చేయనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. వరద కాలువకు ఓటీ కాలువ నిర్మాణం చేసి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని తెలిపారు. కొండగట్టు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి అభివృద్ధి చేస్తామన్నారు.

ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్‌కే ఉంది: నాయిని

ప్రభుత్వం ఏ స్కీం పెట్టినా అది ప్రజలకు ఉపయోగపడేలా పెట్టడం కాంగ్రెస్‌ ఘనత అని, తమ పార్టీకి ఓట్లు అడిగే హక్కు ఉందని వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలు పోలీసులను తిట్టడం ఎంత వరకు సబబని, ఇంకా మూడేళ్ల పాలన ఉందని, తాము ఎక్కియ్యాలంటే తొండలు ఎక్కియ్యలేమా అని ఎద్దేవా చేశారు. మంత్రి తుమ్మలపై ప్రవీణ్‌ కుమార్‌ దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, కోడూరి సత్యనారాయణగౌడ్‌, ఆరెపల్లి మోహన్‌, కరీంనగర్‌ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఆల్ఫోర్స్‌ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

ముఖ్యమంత్రి సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం తెలిపారు. గుమ్లాపూర్‌లో బుధవారం పర్యటించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్‌, పార్కింగ్‌ స్థలాలు పరిశీలించారు. సీఎం సభకు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. సభా ప్రాంగణం, చుట్టు పక్కల పరిసరాలను డ్రోన్‌ కెమరాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. సభకు వచ్చే జనం, వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలు కేటాయించామని సీపీ పేర్కొన్నారు.

గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్‌1
1/1

గుమ్లాపూర్‌కు సీఎం రేవంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement