అసంతృప్తుల జ్వాలలు
రెబల్స్ బెడద
టికెట్లు దక్కలేదని నిరసనలు
ప్రధాన పార్టీలకు తప్పని రెబల్స్ బెడద
పార్టీలకు పలువురు రాజీనామా
స్వతంత్రులుగా పోటీకి సిద్ధం
కరీంనగర్లో రెండు బీ ఫామ్లు ఇచ్చి రచ్చకెక్కిన కాంగ్రెస్ నాయకులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతా వరణం వేడెక్కింది. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో టికెట్లు ఆశించిన వారికి నిరాశ ఎదురవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియడంతో బీఫారాలు అందుకున్నవారు ప్రచార బరిలో దిగారు. ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కలేదన్న ఆగ్రహంతో పలువురు బహిరంగ నిరసనలకు దిగారు. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పార్టీ సభ్యత్వాలు, పదవులకు రాజీనామా చేయడం, నాయకుల దిష్టిబొమ్మలు దహనం చేయడం, నేతల ఇళ్ల ఎదుట ఆందోళనలు నిర్వహించడం, పరస్పర వాగ్వాదాలకు దిగడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ నిర్ణయాలను ధిక్కరిస్తూ కొందరు స్వతంత్రులుగా.. మరికొందరు పార్టీ రెబల్స్గా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలకు రాజీనామా చేసి ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలపై దృష్టి పెట్టారు. ఈ పరిణామాలు ప్రధాన పార్టీలకు కొత్త తలనొప్పిగా మారాయి. రెబల్స్ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నప్పటికీ.. చాలాచోట్ల పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టికెట్ల వ్యవహారం మరింత మంటలు రాజేస్తుండటంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది.
ముమ్మాటికీ తప్పే: మాజీ మంత్రి గంగుల
ఒకే డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి బీఫామ్లు ఇవ్వడం విస్మయాన్ని కల్గించింది. ఇది రాజకీయంగా, సాంకేతికంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి ఈ రెండు బీఫామ్లను తిరస్కరించాలి. నిబంధనలు ఉల్లంఘనకు గురైనందున ఇద్దరు అభ్యర్థులను స్వతంత్రులుగా ప్రకటించాలి. ఇందులో ఎవరినీ కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించినా న్యాయ పోరాటం చేస్తాం.
సత్యనారాయణను నిలదీస్తున్న దుర్శేటి కావ్య
బల్దియా వద్ద కాంగ్రెస్ ఆశావహుల ఆందోళన
కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫాంలు అందించే సమయంలో హైడ్రామా నెలకొంది. తొలుత 50వ డివిజన్ అభ్యర్థిగా కొత్త అనిల్ను హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో పార్టీ కార్పొరేషన్ ఇన్చార్జి వైద్యుల అంజన్కుమార్ బీఫాంను చక్రధర్రావుకు అందించారు. ఈ విషయం తెలి సి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అవాక్కయ్యారు. అనిల్కు కాదని బీఫామ్ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాగైనా అనిల్కు న్యాయం చేయాలనే ఆలోచనతో హైకమాండ్ అప్పటికే 57వ డివిజన్లో కమ్యూనిస్టులకు కేటాయించిన బీఫామ్ అందించారు. ఒక విధంగా అటు నగర, అసెంబ్లీ ఇన్చార్జిలు పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
కరీంనగర్ 53వ డివిజన్కు చెందిన మెండి శ్రీలతచంద్రశేఖర్కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో దళిత మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీలత, చంద్రశేఖర్ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్న ట్లు ప్రకటించారు.
నగరంలోని 2వ డివిజన్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ దాసరి సాగర్ నగరంలోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థి అని ముద్రించుకున్న కరపత్రాలు, పోస్టర్లను తగలబెట్టి నిరసన తెలిపారు.
బీజేపీ నాయకుడు బేతి మహేందర్రెడ్డి పార్టీకి రాజీనామా చేసి, రెబల్గా బరిలో నిలిచాడు.
జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ బెడద మొదలైంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య లేకపోవడంతో పార్టీ రెండు వర్గాలుగా చీలింది.
టికెట్లు దక్కని నేతలు రెబల్స్గా బరిలోకి దిగా రు. రాయికల్లో ఐదుగురు రెబల్స్ పోటీలో ఉన్నారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లిలోనూ కాంగ్రెస్కు బెడద తప్పడం లేదు.
పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలలో రెబల్స్ బెడద ఉంది.
సిరిసిల్లలోనూ అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి. వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్కు 3 డివిజన్లలో, బీఆర్ఎస్కు రెండు డివిజన్లలో రెబల్స్ బరిలో నిలిచి గెలుపోటములపై ప్రభావం చూపనున్నారు.
అసంతృప్తుల జ్వాలలు
అసంతృప్తుల జ్వాలలు
అసంతృప్తుల జ్వాలలు


