ఇసుక తరలిస్తే రూ.50వేలు జరిమానా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే రూ.50వేలు జరిమానా విధించనున్నట్లు గ్రామసభలో సోమవారం తీర్మానించారు. గ్రామ సర్పంచ్ మాదాసు స్రవంతి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామసభలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామం నుంచి అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తే సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేలు నజరానా అందించనున్నట్లు సర్పంచ్ స్రవంతి ప్రకటించారు. గ్రామంలో బెల్ట్షాపులు నిర్వహించరాదని నిర్ణయించారు. ఎవరైనా అక్రమంగా బెల్ట్షాపులు పెట్టి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తీర్మానంలో పేర్కొన్నారు. ఉపసర్పంచ్ మందాటి బాబు, గ్రామ కార్యదర్శి పవిత్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామంలో బెల్ట్షాపులు నిషేధం
ఆదర్శంగా అక్కపల్లి గ్రామం


