బెదిరించి.. ఉపసంహరింపజేసి
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఒకటో డివిజన్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మహిళను, ఆమె కుటుంబాన్ని బెదిరించి నామినేషన్ ఉపసంహరణ చేయించిన ఘటనపై బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణితోపాటు నాయకులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారి, డీజీపీతోపాటు రామగుండం పోలీస్ కమిషనరేట్లోని అడిషనల్ డీసీపీ(అడ్మిన్)ని కలిసి ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు. బీజేపీ ఒకటో డివిజన్ అభ్యర్థి రమ బిశ్వాస్, భర్త పంకజ్ కుమార్బిశ్వాస్ మాట్లాడుతూ, ఎన్టీపీసీ ఇందిరమ్మక్యాంప్లో తాము నివాసం ఉంటున్నామన్నారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి మాత్రమే కాకుండా పోలీసుల పేరిట కూడా తమకు బెదిరింపులు పెరిగాయని ఆవేదన చెందారు. ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఎన్టీపీసీ పరిధిలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు.. పంకజ్ కుమార్ బిశ్వాస్ను ఆయన పనిచేస్తున్న ఎన్టీపీసీ కాంట్రాక్ట్ యాజమాన్యం ద్వారా పిలిపించారని పేర్కొన్నార. అక్కడ పోలీస్ అధికారులు భయభ్రాంతులకు గురిచేశారని, నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే అంతుచూస్తామని బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడి, భయభ్రాంతుల మధ్య తనతో బలవంతంగా వీడియో స్టేట్మెంట్ రికార్డు చేయించారని, అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి తీసుకెళ్లి పలు పత్రాలపై సంతకాలు చేయించి నామినేషన్ ఉపసంహరణ చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీచేసే హక్కును కాలరాస్తూ, భయబ్రాంతులకు గురిచేసి నామినేషన్ ఉపసంహరణ చేయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
నామినేషన్ విత్డ్రాపై పోలీసులకు ఫిర్యాదు


