ఇసుక లారీలతో నరకయాతన
రెడ్డిపల్లి వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులు
రెడ్డిపల్లి–హిమ్మత్నగర్ మధ్య రోడ్డుపై ఆగిన లారీలు
వీణవంక: ఇసుక లారీలతో నరకయాతన పడుతున్నాం.. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల లారీలు అతివేగంగా వెళ్తుంటే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాం.. దుమ్ముతో రోగాల బారిన పడి ఆసుపత్రులపాలవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడని ఆరోపిస్తూ రెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీణవంక–కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. కొండపాక, పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోని మానేరు వాగులో ఉన్న ఇసుక క్వారీల వద్ద వందల లారీలు రోడ్డుకిరువైపులా నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము విపరీతంగా లేచి శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రులపాలవుతున్నామని వాపోయారు. ఇటీవల సీపీ, కలెక్టర్ పర్యటించి రోడ్డుకిరువైపులా వాహనాలను నిలపొద్దని హెచ్చరించినా.. ఇసుక క్వారీ నిర్వాహకుల తీరు మారడం లేదని మండిపడ్డారు. ఇసుక క్వారీల్లో లారీలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించినా.. క్వారీ యజమానులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక క్వారీలను నిలిపేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో విరమించారు.
లారీ పట్టివేత
జమ్మికుంట: అక్రమంగా మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తున్న ఓ లారీని పట్టుకొని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వావిలాల గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా.. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని నారపురం మండలం వావిలాలపల్లి గ్రామానికి చెందిన వెంటేపాక స్వామి అనే లారీ డ్రైవర్, నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామానికి చెందిన దీప శ్రీకాంత్రెడ్డి జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన కూరపాటి సదానందం, జక్కే సదానందం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన సిరికొండ సతీశ్ అనే జేసీబీ డ్రైవర్ సహాయంతో ట్రాక్టర్లు, లారీలో ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకండా రవాణా చేస్తుండగా.. పోలీసులు పట్టుకొని లారీ సీజ్ చేశారు.
రెడ్డిపల్లిలో గ్రామస్తుల ఆందోళన
ఇసుక లారీలతో నరకయాతన


