ఖర్చులెట్లా..?
రాయికల్: మున్సిపాల్టీలో నామినేషన్లు, పరిశీలన పక్రియ పూర్తి కావడంతో.. బీఫాంల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. బీఫాం ఇవ్వకపోయినా.. ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసేందుకు సైతం అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండడంతోపాటు ఎన్నికల గుర్తులు సైతం అభ్యర్థులకు కేటాయించనుంది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఖర్చులకు సైతం ఎలా డబ్బులు కూడబెట్టాలో వాటి ప్రయత్నంలో ఉన్నారు.
ఎన్నికల ఖర్చులకు పరేషాన్
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ మున్సిపాల్టీలుండగా.. కౌన్సిలర్గా గెలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. రాయికల్, ధర్మపురి వంటి చిన్న మున్సిపాల్టీల్లో ఒక్కో అభ్యర్థికి రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఖర్చవుతుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి మున్సిపాల్టీల్లో రూ.20లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చవుతుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. భూమి కాగితాలు కుదవపెట్టి రూ.3 వడ్డీకి అప్పులు తీసుకురావడం, చిట్టీలు ఎత్తడం, ఇంట్లో ఉన్న బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం, భూములమ్మేందుకు వెనుకాడడం లేదు.
భారం తప్పదు..
రాయికల్, ధర్మపురి లాంటి చిన్న మున్సిపాల్టీల్లో గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ముందుగానే చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడంతో.. వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గింది. చైర్మన్ అభ్యర్థి ఎన్నికల్లో ముందుగా ఒక్కొక్కరికి రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు ఎన్నికల డబ్బులు సమర్పించేవారు. ఇప్పుడు సీను రివర్స్ అయింది. అభ్యర్థులు గెలిచిన తరువాతే చైర్మన్ ఎన్నిక చేపడతామని పార్టీలు సైతం ప్రకటించడంతో.. పోటీ చేసే కౌన్సిలర్లపై ఆర్థికంగా మరింత భారం పడనుంది. ఏదేమైనా జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి పెద్ద మున్సిపల్లో చైర్మన్ ఎన్నికయ్యే లోపు అభ్యర్థులు రూ.లక్షలు, రూ.కోట్లల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది.
● ఆందోళనలో ఆశావహులు
● అప్పుల కోసం వెతుకులాట
● చిట్టీలు ఎత్తుతున్న వైనం


