జిల్లాలో అన్ని మున్సిపాలిటీలూ బీజేపీవే
కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కరీంనగర్ మేయర్ పీఠంతో పాటు మూడు మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికస్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం కరీంనగర్లోని శుభం కన్వెన్షన్లో కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్చార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టిక్కెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్లో 80శాతంపైగా టిక్కెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టిక్కెట్లు రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులిచ్చి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని అన్నారు. టిక్కెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్లో బీజేపీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి, పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


