చేలలో మట్టి తవ్వకాలు
రుద్రంగి(వేములవాడ): రైతుల పంట చేలలో మట్టి మాఫియా అక్రమంగా తవ్వకాలు చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా బీళ్లుగా ఉన్న భూముల్లో మట్టి తవ్వి సొమ్ము చేసుకుంది. అయితే ప్రభుత్వ భూమిగా భావించిన అధికారులు ఆ ప్రాంతంలో కార్యాలయాల కోసం సర్వే చేయడంతో కబ్జాలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగుచేసుకొని బతుకుతున్నామని.. ఇప్పుడు సర్వే చేసి భూములు లాక్కోవద్దని వారు వేడుకుంటున్నారు.
దశాబ్దాల క్రితం పట్టాలు పంపిణీ
రుద్రంగి మండల కేంద్రం శివారులోని సర్వేనంబర్ 428లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోనే దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం వందలాది మంది నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేసింది. ఇలా 534 ఎకరాలలో దాదాపు వంద మంది వరకు కబ్జాలో ఉన్నారు. వీరంతా వానాకాలంలో భూములను సాగుచేసుకుంటున్నారు. ఎండాకాలంలో నీటి కొరతతో బీళ్లుగా ఉంచుతున్నారు. ఇదే అదునుగా భావించిన మట్టి మాఫియా ఆయా భూముల్లో జేసీబీలతో తవ్వి మట్టిని అమ్ముకుంటుంది.
జేసీబీలతో మట్టి తవ్వకాలు
గండివేంకటేశ్వర్లు ఆలయం సమీపంలోని, ఎల్లంపల్లి కాల్వ పక్కన దాదాపు ఆరు ఎకరాలు ప్రభుత్వం పంపిణీ చేసిన లావణి పట్టాభూమిలో ఆరుగురు సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కాల్వనీరు రాకపోవడంతో బీళ్లుగా ఉన్నాయి. ఇదే అవకాశంగా మట్టి మాఫియా ఆ భూముల్లో తవ్వకాలు చేపట్టింది. అవి ప్రభుత్వ భూములుగా భావించి అధికారులు కార్యాలయాల నిర్మాణం కోసం సర్వే చేశారు. మట్టి మాఫియా దౌర్జన్యంగా మట్టి తీస్తుందని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ పంట చేలలో అక్రమంగా మట్టి తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమకు జీవనాధారం కోసం ఇచ్చిన పంటచేలకు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నారు.
దశాబ్దాల క్రితం పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం
ఆ భూముల్లోనే అక్రమంగా మట్టి తవ్వకాలు
ప్రభుత్వ కార్యాలయల కోసం పరిశీలించిన అధికారులు
భూములు లాక్కోవద్దంటూ రైతుల విన్నపం


