నామినేషన్ల సందడి
రేపు అన్ని పార్టీల అభ్యర్థుల ఖరారు
తొలిరోజు మిశ్రమ స్పందన
సర్వేల ఆధారంగానే పార్టీల టికెట్లు
ఎవరికి ఇవ్వాలనే ఒత్తిడిలో నేతలు
జోరుగా ఆశావహుల పైరవీలు
రేపు అన్ని పార్టీల అభ్యర్థుల ఖరారు
‘హస్తం’లో ముగ్గురు మంత్రులే కీలకం
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. బుధవారం నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించడంతో సమయం లేక అభ్యర్థులు, పార్టీల నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొదటి రోజు కొంతమంది నామినేషన్లు దాఖలు చేసి, టికెట్లు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల్లోని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే గెలుపు పక్కా అంటూ నమ్మకంగా చెబుతున్నారు. ఒక్కో వార్డు/డివిజన్లో పార్టీ టికెట్లు ఆశించే వారు 3 నుంచి నలుగురు ఉండడంతో నేతలకు తలనొప్పిగా మారింది. ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పలువురు ఆశావహులు గాడ్ ఫాదర్లను నమ్ముకొని, టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.
సర్వేల ఆధారంగా టికెట్లు
ఒక్కోవార్డు/డివిజన్లో ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో పార్టీలన్నీ సర్వే నిర్వహించాయి. షెడ్యూల్ ఖరారు కాగానే కొత్తవారు తెరపైకి రావడంతో సర్వే ఆధారంగా గెలిచే అవకాశం ఎవరికున్నదనే ప్రాతిపదికన టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల్లోని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. అభ్యర్థుల గుణగణాలు, ప్రజల్లో ఆదరణ, పార్టీకి అందిస్తున్న సేవలు తది తర అంశాలను పరిగణలోకి తీసుకొని టికెట్ల కేటా యింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు, నియోజవర్గ ఇన్చార్జిలు అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీలను గెలుచుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజూరాబాద్ కాంగ్రెస్ నేత వొడితెల ప్రణవ్ వ్యూహరచన చేస్తున్నారు.
● బీఆర్ఎస్ విషయానికొస్తే కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు చక్రం తిప్పుతున్నారు. బీజేపీలో మాత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్ని తానై నడిపిస్తున్నారు.
● పెద్దపల్లి జిల్లాలో రామగుండం కార్పొరేషన్తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సి పాలిటీలు ఉన్నాయి. కాంగ్రెస్లో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు విజయరమణా రావు, ఎంఎస్ రాజ్ఠాకూర్ టికెట్ల కేటాయింపులపై దృష్టి సారించారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, పుట్టమధు, బీజేపీ పార్టీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్రావు, సునీల్రెడ్డి, కందుల సంధ్యారాణి టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు.
● సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ దృష్టిసారించారు. బీఆర్ఎస్లో మాజీ మంత్రి కె.తారకరామారావు, చల్మెడ లక్ష్మి నరసింహరావులు, బీజేపీలో యథావిధిగా బండి సంజయ్కుమారే టికెట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు.
● జగిత్యాల జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పరిశీలిస్తుండగా, బీఆర్ఎస్లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ టికెట్ల వ్యవహారాన్ని చూస్తున్నారు. బీజేపీలో ఎంపీ అర్వింద్ అభ్యర్థుల ఖరారులో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు అన్నిపార్టీలు రేపు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముంది. అదే రోజు బీ–ఫారాలు అప్పగిస్తే వారంతా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల అధికారులకు దాఖలు చేస్తారు. అయితే మేయర్/చైర్మన్ అభ్యర్థుల ఖరారు మాత్రం పార్టీలకు సంకటంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా మేయర్/చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేయలేదు. దీంతో రిజర్వేషన్ అనుకూలించే ప్రతీ సీనియర్ నేత పోటీకి దిగుతున్నారు. పోటీకి సిద్ధమైనవారు ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు.
నామినేషన్ల సందడి


