కొండగట్టులో అర్చకుల ధర్నా
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంత్రావు తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ అర్చకులు శుక్రవారం విధులు బహిష్కరించి ఆలయ రాజగోపురం ఎదుట బైఠాయించారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొంతమంది ఏపీ టీడీపీ నాయకులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కొండగట్టు ఆలయానికి రాగా, అర్చకులు స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. దీంతో అర్చకులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తన అనుమతి లేకుండా ఎందుకు చేశారని, అందరికీ మెమో జారీ చేస్తామని ఆలయ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించి ఆలయం ఎదుట సుమారు గంటపాటు బైఠాయించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అర్చకులతో ఫోన్లో మాట్లాడి, విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
టీడీపీ నాయకుల పూజలతో ముదిరిన వివాదం
కొండగట్టు ఆలయంలో కొంతకాలంగా అర్చకులు, ఈవో మధ్య వివాదం కొనసాగుతుండగా, శుక్రవారం ఏపీ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ నాయకులు ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చారు. అధికారుల సిఫార్సుతో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తన అనుమతి లేకుండా పూజలు చేయడం ఏమిటీ అంటూ ఈవో అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది.
– కపీందర్, స్థానాచార్యులు
కొండగట్టు అర్చకుల మనోభావాలు దెబ్బతీసేలా ఈవో వ్యవహరిస్తున్నారని, అధికారుల సిఫార్సు మేరకు టీడీపీ నాయకులకు పూజలు చేశామని స్థానాచార్యులు కపీందర్ పేర్కొన్నారు. ఆలయంలో రాజకీయం చేస్తున్నారంటూ ఈవో ఇష్టారీతిన మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ఆచార, వ్యవహారాలు కాపాడాలని, తమ మనోభావాలను గౌరవించాలని కోరారు.
తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆలయ ఈవోపై ఆగ్రహం


