బీఆర్ఎస్, బీజేపీ అవినీతి కవలలు
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్, బీజేపీ అవినీతి కవలలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం మాట్లాడుతూ.. పదేళ్లపాటు నగరాన్ని ధ్వంసం చేసి, అవినీతికి చిరునామాగా మార్చారన్నారు. స్మార్ట్సిటీ, కేబుల్ బ్రిడ్జి పనుల్లో అక్రమాలు జరిగాయన్నారు. కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్, బీజేపీ నాయకుల జేబులు నింపేందుకే స్మార్ట్సిటీ పనులను ఉపయోగించుకొన్నారన్నారు. నగరపాలకసంస్థ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే అవినీతికి మద్దతునిచ్చినట్లేనని తెలిపారు. మహంతి సీపీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బయటకు రావాలంటే వణికిపోయారన్నారు. పల్లెల్లో గెలిచినట్లుగానే పట్టణ పోరులోనూ కాంగ్రెస్దే విజయమన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంతోషంగా లేనిది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. పార్టీ టికెట్లను పీసీసీ స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. సర్వే ప్రకారం గెలిచేవాళ్లకే టికెట్లు ఇస్తామని, టికెట్ రాని సీనియర్లకు ఇతర అవకాశాలు కల్పిస్తామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ పాల్గొన్నారు.


