నష్ట నివారణ చర్యల్లో విఫలం
కరీంనగర్: భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నా, ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ధా న్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గత కొన్నేళ్లుగా పంట నష్టాలకు సరైన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలపై మాత్రమే ప్రభుత్వం, రాజకీ య పార్టీలు శ్రద్ధ చూపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు ఖర్చు చేస్తున్న నిధులతో రైతులను ఆదుకోవచ్చన్నారు. కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన సంజయ్, వర్షం నష్టంపై ఆరా తీసి బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైతులు, ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు.
విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
కొత్తపల్లి(కరీంనగర్): మోంథా తుపాన్ ప్రభా వంతో కురుస్తున్న అతి భారీ వర్షాలతో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో తడిగా ఉన్న చేతులతో స్విచ్లు, మీటర్లు, ప్లగ్లు, వైర్లు తాకరాదన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు సమీప లైన్మెన్కి, 1912 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వాలన్నారు. తక్కువ ఎత్తులో వెళ్లే విద్యుత్ తీగల కింద వాహనాలు నడపొద్దన్నారు. పిల్లలను విద్యుత్ పరికరాల దగ్గర ఆడనీయకుండా దూరంగా ఉంచాలన్నారు. పొలా ల్లో లేదా బోర్వెల్ వద్ద పనిచేసే సమయంలో తడి నేలపై నిలబడి విద్యుత్ మోటార్ స్విచ్లను ఆన్/ఆఫ్ చేయొద్దన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన విద్యుత్ పరికరాలను తాకొద్దని సూచించారు.
ప్రభుత్వ కళాశాల తనిఖీ
కరీంనగర్టౌన్: కరీంనగర్లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు భరోసా కల్పించాలన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేటు వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు సుడా చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు మెయిన్ గేటు వద్ద పోలీసులు ఉండాలని సూచించారు. డీఐఈవో గంగాధర్, ప్రిన్సిపాల్ నిర్మల, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ ఎంఈవో పోస్టునుంచి తొలగింపు
కరీంనగర్రూరల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కరీంనగర్రూరల్ మండల విద్యాధికారి కె.రవీందర్ను కలెక్టర్ పమేలా సత్పతి తొలగించారు. ఈ నెల 22న కలెక్టర్ దుర్శేడ్ జెడ్పీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ గాడి తప్పడం, ప్రధానోపాధ్యాయుడు పదోన్నతి రద్దు చేసుకుని ఉపాధ్యాయుడిగా తిరిగి వెళ్లిపోతే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిని నియమించడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న దుర్శేడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నాగ వెంకట రత్నాకర్రావును మొగ్ధుంపూర్ జెడ్పీ పాఠశాలకు సర్ధుబాటు ప్రాతిపదికన బదిలీ చేశారు. కొత్త ఎంఈవోగా చామనపల్లి జెడ్పీ పాఠశాల గెజిటెట్ హెచ్ఎం వాసవిని నియమించారు. రవీందర్ను తిరిగి నగునూరు జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమించారు.
క్వింటాల్ పత్తి రూ.7,000
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,000 పలికింది. బుధవారం మార్కెట్కు 579 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. సీసీఐ ద్వారా 65క్వింటాళ్ల పత్తిని గరిష్ట ధర రూ.8,003, కనిష్ట ధర రూ.7,735కు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు.


