ప్రత్యేక బృందం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బృందం

Sep 27 2025 5:05 AM | Updated on Sep 27 2025 5:05 AM

ప్రత్యేక బృందం

ప్రత్యేక బృందం

రిటెయినింగ్‌ వాల్‌ నిర్మిస్తాం

హైదరాబాద్‌ నుంచి వచ్చిన స్పెషల్‌టీం అధ్యయనం

ఫైరింగ్‌ రేంజ్‌ సరిహద్దులో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించాలని సూచన

ఘటనపై సీపీకి, డీజీపీకి పూర్తిస్థాయి నివేదిక

9 ఎంఎం బుల్లెట్‌ కిలోమీటరు దూరం ఎలా వెళ్లిందో అంతుచిక్కని వైనం

‘సాక్షి’ కథనంతో కదిలిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం

బోనాలపల్లెకు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

లగందులను ఆనుకుని ఉన్న బోనాలపల్లైపెకి పోలీసు తూటాలు దూసుకుపోయిన ఘటనపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌ నుంచి స్పెషల్‌ టీం గురు, శుక్రవారాల్లో బోనాలపల్లెలో పర్యటించింది. అనూహ్యంగా తమపై దూసుకొస్తున్న తూటాలతో ప్రాణహాని పొంచి ఉందని గ్రామస్తులు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న విషయం తెలిసిదే. కరీంనగర్‌ సీపీ ఇచ్చిన సమాచారంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక బృందాన్ని పంపింది. ఇందులో గ్రేహౌండ్స్‌, ఐఎస్‌డబ్ల్యూ, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరు స్థానిక పోలీసులతో కలిసి తొలుత ఎలగందుల ఫైరింగ్‌ రేంజ్‌, అనంతరం బోనాలపల్లె గ్రామాన్ని సందర్శించి పలు విషయాలను సమగ్రంగా పరిశీలించారు. బోనాలపల్లెలో అమృతమ్మ అనే 80 ఏళ్లుపైబడిన వృద్ధురాలి తుంటికి తూటా గాయం అయిన విషయాన్ని ‘సాక్షి’ ఈనెల 22న ‘బోనాలపల్లెకు తూటా గాయం’ శీర్షికన ప్రచురించిన విషయం తెలిసిందే

రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించాలట

ఎలగందుల ఫైరింగ్‌ రేంజ్‌లో ఫైరింగ్‌ జరుగుతున్న తీరు, టార్గెట్‌ను తాకిన తరువాత బుల్లెట్లు దిశను మార్చుకున్న తీరును ప్రత్యేక బృందం పరిశీలించింది. అనంతరం అక్కడ నుంచి పొరుగునే ఉన్న బోనాలపల్లె గ్రామానికి వెళ్లారు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, బుల్లెట్లు దూసుకువచ్చిన తీరును అంచనా వేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇకపై బుల్లెట్లు గ్రామంవైపునకు దూసుకు రాకుండా ఉండాలంటే.. ఫైరింగ్‌ రేంజ్‌ వెనకాల భారీ రీటెయినింగ్‌ వాల్‌ నిర్మించాలని అధికారులకు సూచించారు. దాంతో టార్గెట్‌ను తాకిన తరువాత వెనక ఉన్న రాళ్లను తాకి దిశ మార్చుకున్నా.. బులెట్లు బోనాలపల్లె వైపునకు దూసుకురాకుండా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సీపీకి, డీజీపీకి సమర్పించబోయే నివేదికలో పొందుపరచనున్నారు.

9 ఎంఎం బుల్లెట్‌ కిలోమీటరు ప్రయాణం

హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి ఒక విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఫైరింగ్‌ రేంజ్‌ నుంచి దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న అమృతమ్మకు బుల్లెట్‌ తాకడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అమతమ్మను తాకింది ఎస్‌ఎల్‌ఆర్‌ నుంచి వెలువడిన తూటా అనుకున్నారు. కానీ అది 9ఎంఎం బుల్లెట్‌ అని హైదరాబాద్‌ నుంచి వచ్చిన సాంకేతిక బృందం ధ్రువీకరించింది. సాధారణంగా 9ఎంఎం బుల్లెట్‌ పిస్టల్‌ లేదా కార్బన్‌ నుంచి వచ్చి ఉంటుందని అంచనాకు వచ్చారు. సాధారణంగా పిస్టల్‌ నుంచి వెలువడిన 9ఎంఎం బుల్లెట్‌ ప్రయాణించే దూరం కిలోమీటరులోపే. కానీ, బహిరంగ ప్రదేశాల్లో ఇది సాధ్యం కాదు. గాలి వీచే దిశ, ఇతర ఆటంకాలు అనేక మార్గమధ్యలో తూటా వేగాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ టార్గెట్‌ను తాకిన తరువాత కూడా కిలోమీటరు ప్రయాణం చేయడం పోలీసు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసిన అనంతరం పూర్తిస్థాయి నివేదికలో పొందుపరచనున్నారు.

పోలీసులు ఫైరింగ్‌ చేసిన బుల్లెట్లు ఇకపై గ్రామంవైపు రాకుండా చర్యలు చేపడతాం. ఇందుకోసం ఫైరింగ్‌ రేంజ్‌ సరిహద్దులో రిటెయినింగ్‌ వాల్‌ నిర్మిస్తాం. బుల్లెట్లు బోనాలపల్లెను తాకడానికి పక్కనే ఉన్న గుట్ట ఎత్తు తగ్గడం కారణం కాదు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం సూచనల ప్రకారం రక్షణ ఏర్పాట్లు చేపడతాం.

– గౌస్‌ ఆలం, సీపీ, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement