
ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించుకోవాలి
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఆయుర్వేద వైద్యసేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రాంనగర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణులకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యస్రబ్ సుల్తానా, డీపీఎం ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.
హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలన
వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజిదా పాల్గొన్నారు.