లోక్‌ అదాలత్‌లో 3,194 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో 3,194 కేసులు పరిష్కారం

Sep 14 2025 3:21 AM | Updated on Sep 14 2025 3:21 AM

లోక్‌ అదాలత్‌లో   3,194 కేసులు పరిష్కారం

లోక్‌ అదాలత్‌లో 3,194 కేసులు పరిష్కారం

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌ ● ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న రాజన్న సిరిసిల్ల రెవెన్యూ అధికారులు యోగా పోటీల్లో చాంపియన్‌గా నిలవాలి 15న పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభం

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.శివకుమార్‌

కరీంనగర్‌క్రైం: లోక్‌ అదాలత్‌లో రాజీద్వారా కేసుల సత్వర పరిష్కారం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ ఎస్‌.శివకుమార్‌ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీ య లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన జడ్జి ఎస్‌.శివకుమార్‌ మాట్లాడు తూ.. రాజీ ద్వారా ఇరు పార్టీల వారు తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతో షంగా ఉంటారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్‌ మాట్లాడుతూ.. జాతీయ లోక్‌ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 3,194 కేసులు పరిష్కరించబడ్డాయని సివిల్‌ కేసులు71, క్రిమినల్‌ కేసులు 3,123, బ్యాంక్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు 109తో పాటు ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు 74,651 పరిష్కరించినట్లు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ న్యాయమూర్తులు, పోలీసు అధికారుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించబడుతున్నాయని తెలిపారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

20 ఎకరాలు.. రూ.60 కోట్లు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల దురాక్రమణపై మరోసారి ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ల్యాండ్‌ మాఫియాపై కొరడా ఝుళిపించే క్రమంలో వేములవాడ మండలం నాంపల్లి శివారులో సుమారు రూ.60కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులోని సర్వేనంబర్లు 485, 486, 487లో సుమారు 20 ఎకరాల భూమి జిల్లా కేంద్రం సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదు అందుకున్న జిల్లా రెవెన్యూ అధికారులు సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందని విచారణలో తేల్చారు. దీంతో రెవెన్యూ అధికారులు సదరు స్థలాలను ప్రభుత్వానికి స్వాధీనం పరిచారు. రూ.60కోట్ల విలువైన స్థలాలు తిరిగి ప్రభుత్వపరం కావడం రాజకీయంగా, స్థానికంగా చర్చనీయాంశమైంది.

కరీంనగర్‌స్పోర్ట్స్‌: నల్గొండ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న 12వ సీనియర్స్‌ యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌ సూచించారు. శనివారం అంబేద్కర్‌ స్టేడియంలో యోగా క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను డీవైఎస్‌వో శ్రీనివాస్‌గౌడ్‌, యోగా అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకృష్ణ, కార్యదర్శి నాగిరెడ్డి సిధారెడ్డి, కోచ్‌లు కిష్టయ్య, రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనందకిషోర్‌, తిరుపతి అభినందించారు.

కరీంనగర్‌టౌన్‌: భారత విదేశాంగ మంత్రిత్వశాఖ రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీస్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌ కమాన్‌రోడ్డులోని ఫార్చూన్‌మాల్‌ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఈనెల 15న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ కె.జె.శ్రీనివాస్‌, హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ జె.స్నేహజ తెలిపారు. ఇప్పటి వరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని మున్సిపల్‌ భవనంలో పాస్‌పోర్టు లఘుసేవా కేంద్రం కొనసాగగా, ఇక నుంచి నూతన భవనంలో పూర్తిస్థాయి సేవలు అందించనుందని వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, ఎల్‌.రమణ, చిన్నమైల్‌ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హాజరుకానున్నారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement