
మనిషికి ఆధార్.. కమతానికి భూధార్
వీణవంక/మానకొండూర్: మనిషికి ఆధార్కార్డు మాదిరిగా కమతానికి భూధార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. భూ భారతి చట్టంతో సాదాబైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని సూచించారు. ఈ మేరకు వీణవంక మండలం చల్లూరు రైతువేదికలో భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కల్పించారు. ధరణిలో పొరపాట్లను సవరించేందుకు కలెక్టర్లకు మినహా ఏ అధికారికి అవకాశం లేదని, భూ భారతితో తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం సకాలంలో తూకం వేసి మిల్లులకు పంపాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు సరిపడా ఉన్నాయా అని సిబ్బందిని అడిగారు. రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్డీవో రమేశ్బాబు, ఏడీఏ సుజాత, తహసీల్దార్ గుర్రం శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్, ఏవో గణేశ్, రైతులు పాల్గొన్నారు.
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సోమవారం మానకొండూరులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు ఉండొదన్నారు. దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జాబితా సిద్ధం చేసి, ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించాలన్నారు. కమిటీ ఆమోదించిన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి ముందుగా ఎంపీడీవో, ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి సంయుక్తంగా మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని సూచించారు. అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగించాలన్నారు. తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో వరలక్ష్మి, కార్యదర్శి రేవంత్రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
భూ భారతితో సాదాబైనామాల సమస్య పరిష్కారం
చల్లూరు అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి