
భూహత్యలు.. తెగిపోతున్న బంధాలు
● ప్రాణాలు తీస్తున్నారు
● హద్దుల కోసం దాడులు
● బంధాలు మరిచిపోతున్న జనం
‘వేములవాడలో తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదని తండ్రిపై కొడుకు దాడి చేశాడు. ఇంట్లోకి దూరి ప్రాణాలు తీశాడు.’
‘సిరిసిల్లలో ఇంటి పక్కన ఉన్న 3 ఫీట్ల స్థలం కోసం రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే యువకుడు క్షణికావేశంలో చిన్నాన్న కుటుంబంపై స్నేహితులతో కలిసి దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నాన్న మూడేళ్ల కొడుకు ప్రాణాలు కోల్పోయాడు.’
‘చందుర్తి మండలంలో భూవివాదంలో తన పెద్దమ్మనే కత్తితో తలపై నరికి చంపాడు ఓ యువకుడు. ఈ యువకుడు మైనర్గా ఉన్న వయసులోనూ ఒకరిని హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు.’
సిరిసిల్లక్రైం: క్షణికావేశం.. కాంప్రమైజ్ కావాలనే ఆలోచన లేకపోవడంతో భూహత్యలు జరుగుతున్నాయి. గజం స్థలం కోసం నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. సొంత కుటుంబీకులు.. బంధువులు.. ఇంటి పక్కవారు.. ఇలా ఎవరిౖపైనెనా దాడి చేసేస్తున్నారు. ప్రాణాలు తీస్తున్నారు. బతకడం కోసం కొంత భూమి ఉండాలన్నది పాతకాలపు మాట. భూమి దక్కించుకునేందుకు ప్రాణాలు సైతం తీస్తామంటున్నారు కొందరు. వరుస హత్యలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పంచాయితీలు.. సెటిల్మెంట్స్
భూమి పంచాయితీలు సాధారణంగా ఇరువర్గాల మధ్య పెద్దమనుషుల సమక్షంలో జరుగుతుంటాయి. పెద్దలు చెప్పిన తీర్పు ఒకరికి న్యాయంగా అనిపిస్తే.. మరొకరికి అన్యాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో గొడవలు జరుగుతున్నాయి. ఊరు పెద్దల మధ్య పంచాయితీలు తీరక.. ఠాణా మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ కూడా పంచాయితీలు పరిష్కారం కాకపోవడంతో కోర్టుల చుట్టూ ఏళ్లకు ఏళ్లుగా తిరుగుతున్నారు. మరికొందరైతే ఎదుటి వ్యక్తి అడ్డు తొలగించుకునేందుకు ప్రాణాలు తీస్తున్నారు.
నిబంధనలుఅతిక్రమిస్తే చర్యలు
భూవివాదాలను కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టాలు అతిక్రమించి పంచాయితీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. నేరచరిత్ర కలిగి ఉండి భయభ్రాంతులకు గురిచేస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. సమస్యలు చట్ట పరిధిలో కోర్టును ఆశ్రయించి పరిష్కరించుకోవాలి.
– మహేశ్ బీ గీతే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల

భూహత్యలు.. తెగిపోతున్న బంధాలు

భూహత్యలు.. తెగిపోతున్న బంధాలు