
ఎంపీసీ విద్యార్థుల కోసం అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్స
● ఫార్మర్స్, స్పెషల్ కోటా సీట్ల భర్తీకి అగ్రి వర్శిటీ నోటిఫికేషన్
● ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు
జగిత్యాలఅగ్రికల్చర్: ఇంటర్లో ఎంపీసీ చదివి, తెలంగాణ ఎంసెట్–2025 రాసిన విద్యార్థులు బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)లో చేరేందుకు సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్యవసాయ సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశం ఉండడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారు.
ఫార్మర్స్ కోటా, పేమెంట్ కోటాకు సంబంధించి..
ప్రస్తుతం ఫార్మర్స్, పేమెంట్ కోటాలకు సంబంధించి వ్యవసాయ వర్శిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులు రెండు మార్గాలుగా అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యామండలి నిర్వహించే ఇంజినీరింగ్ ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా చేరవచ్చు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు తమ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. అలాగే ఫార్మర్స్ కోటా, సెల్ఫ్ఫైనాన్స్(పే మెంట్) కోటా కింద వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా చేరవచ్చు. రెండు మార్గాల్లోను తెలంగాణ ఎంసెట్–2025లో వచ్చిన ర్యాంకుల ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు.
రైతు కోటా కింద సీట్ల వివరాలు
బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) కళాశాల సంగారెడ్డి జిల్లా కందిలో ఉండగా, ఫార్మర్స్ కోటా కింద 20, పేమెంట్ కింద 9 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కళాశాల నిజమాబాద్ జిల్లా రుద్రూర్లో ఉండగా, ఫార్మర్స్ కోటా 10, పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్) కళాశాల హైదరాబాద్లోని సైఫాబాద్లో ఉండగా 37 (నాన్రూరల్, రూరల్), పేమెంట్ కోటా కింద 5 సీట్లు భర్తీ చేస్తారు. అలాగే మూడేళ్ల హోం సైన్స్ చదివినవారికి హోంసైన్స్ కోర్సుల్లో 10 శాతం రిజర్వ్ చేయబడ్డాయి. పేమెంట్ కోటా కింద సీటు పొందిన వారు, సెమిస్టర్కు రూ.62,500 చొప్పున 8 సెమిస్టర్లకు రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ కోటా సైతం ఎంసెట్ ర్యాంక్ ఆధారంగానే కేటాయిస్తారు.
దరఖాస్తు
గడువు..
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఈనెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్లైన్లో పంపించేందుకు ఆఖరు తేదీ ఈనెల 28. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అడ్మిషన్ పొందే నాటికి వయస్సు 17–22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏళ్లు, పీహెచ్ వారికి 27 ఏళ్ల వరకు ఉండవచ్చు. రెగ్యులర్ కోర్సుల ఫీజు రూ.49,560. ఫార్మర్స్ కోటా కింద దరఖాస్తు చేసేవారు 1 నుంచి 12వ తరగతి వరకు నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండాలి. అలాగే, ఒక ఎకరం తక్కువ కాకుండా వ్యవసాయ భూమి విద్యార్థి లేదా తల్లిదండ్రుల పేరిట ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది రైతు కూలీల పిల్లలకు సైతం 15 శాతం రిజర్వేషన్ కల్పించారు. రైతు కూలీల ధ్రువీకరణ కోసం ఈజీఎస్ జాబ్ కార్డు ఉండాలి. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ కోసం గ్రామీణ ప్రాంతాల్లో చదవని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వ్యవసాయ వర్శిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. పీజేటీఏయూ.ఈడీయూ.ఇన్లో సంప్రదించవచ్చు.