
జగిత్యాలకు రెడ్ అలర్ట్
బయటకు వెళ్లలేని పరిస్థితి
ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం ఆరుగంటల తర్వాత కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నాం. ఎండలకు కూలీలు కూడా వ్యవసాయ పనులకు రావడం లేదు.
– ఏలేటి స్వామిరెడ్డి,
శ్రీరాములపల్లె, గొల్లపల్లి(మం)
మరో నాలుగు రోజులు
వాతావరణ మార్పులతో రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండే అవకాశం ఉంది. వాతావా రణ విభాగం వారు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం భూమిలో తేమ శాతం ఎక్కువగా లేకపోవడంతో ఉష్ణోగ్రతలకే ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది.
– శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస
జగిత్యాలఅగ్రికల్చర్: కొద్దిరోజులుగా సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్లోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఇక మే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చని పొలాస వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశ నుంచి వడగాలులు వీస్తుండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.8 డిగ్రీల సెల్సియస్లో కదలాడుతున్నాయి. రానున్న రెండుమూడు రోజుల్లో మరో రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అత్యవసరమైతనే బయటకు వెళ్లాలి
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం గంటకు 30 నుంచి40 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం వేడితో కూడిన వడగాలులు వస్తుండటంతో ప్రజలు అతులాకుతలం అవుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటోంది.
వడదెబ్బతో విలవిల
ఉష్ణోగ్రతలు పెరిగినకొద్దీ శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. దీంతో నీరసం వస్తుంది. నీటి శాతం తక్కువ అయినప్పుడు వడదెబ్బకు గురయ్యే ఆస్కారం ఉంది. దీనికితోడు దురద, చెమటకాయ, పొక్కులు, నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కళ్లు మంటలు మండి ఎరుపుచారలు వస్తాయి. గ్రామాల్లో లోతైన బావుల నీరు తాగినప్పుడు విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. ఎండకు వెళ్లినప్పుడు కళ్లజోళ్లతోపాటు చర్మం పూర్తిగా కప్పేలా బట్టలు ధరించడం మంచిదంటున్నారు వైద్యులు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు మజ్జిగ, పెరుగు, నిమ్మరసాలు తీసుకోవాలంటున్నారు.
వాతావరణ మార్పులే కారణం
వాతావరణంలో అప్పటికప్పుడు వస్తున్న మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కార్బన్ డైఆక్సెడ్, మిథేన్, నైట్రస్ ఆకై ్సడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా భూమి ఉపరితల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలోనూ, వాతావరణంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా..
జిల్లాలో ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. రాయికల్, ధర్మపురి మండలం నేరేళ్ల, కోరుట్ల మండలం అయిలాపూర్, గొల్లపల్లి మండలాల్లో 44.1 డిగ్రీలు, ఎండపల్లి మండలం మారెడుపల్లి, సారంగాపూర్, రాయికల్ మండలం అల్లీపూర్లో 44 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజులు కూడా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
మరో నాలుగు రోజులూ ఎండలే
రోజురోజుకూ మండుతున్న సూర్యుడు
బుధవారం 45 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత

జగిత్యాలకు రెడ్ అలర్ట్

జగిత్యాలకు రెడ్ అలర్ట్