● నేడు శ్రీరామనవమి ● ముస్తాబైన ఆలయాలు
కరీంనగర్ కల్చరల్/ఇల్లందకుంట: నేటి శ్రీరామనవమి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు సీతారాముల కల్యాణ వేడుక జరిపించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, కూలర్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జి ప్రణవ్బాబు, ఆర్డీవో రమేశ్బాబు పరిశీలించారు. జమ్మికుంట రైస్మిల్లర్ల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించనున్నారు. నగరంలోని మహాశక్తి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పెళ్లి వేడుకకు హాజరయ్యే భక్తులకు వేద పండితుల ఆశీర్వచనంతోపాటు తలంబ్రాలను అందజేయనున్నారు. 25వేల మందికి అన్నదానం చేయనున్నారు. మహాశక్తి ఆలయంలో నిర్వహించే సీతారామచంద్రస్వామి వివాహ వేడుకలకు ప్రతి ఒక్కరూ తరలిరావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు.


