కూర దేవేందర్ ఉరఫ్ అమర్ ‘మిత్ర’ కలం పేరుతో అనేక పాటలు, సిద్ధాంత గ్రంథాలు, సామాజిక వ్యాసాలు రాశారు. వేములవాడకు చెందిన దేవేందర్ విద్యార్థి దశలోనే విప్లవోద్యమాల్లోకి వెళ్లారు. సోదరుడు కూర రాజన్న బాటలో సాగిన అమర్ తొలినాళ్లలోనే ‘ఈ సంకట ప్రభుత్వాన్ని కూల్చ వెంకటనారాయణ..’ అంటూ పాటను రాశారు. రెండు వేలకుపైగా పాటలు రాసిన అమర్.. విప్లవోద్యమంలో అమరులైన వారిపై రాసిన అనేక పాటలు జనబాహుళ్యంలో ఇప్పటికీ మారుమోగుతున్నాయి. ఆయన రాసిన పాటలను అమర్ భార్య విమలక్క గొంతు నుంచి జాలువారాయి. గంగపుత్రుల జీవితాలపై ‘ఓసు’ అనే కథను రాశారు. ‘చితాభస్మంలోంచి’ అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించారు. తల్లిపైనా, పల్లైపెనా, ఉద్యమాలపై, జైలు జీవితాలపై, తెలంగాణ ఉద్యమంలోనూ అనేక పాటలు అందించారు అమర్. సామాజికాంశాలపై వ్యాసాలు రాశారు.
‘అమ్మా ననుగన్నందుకు విప్లవాభివందనాలు.. పొలాలలో పరిగె గింజలేరుకునే కాలమందు’.. అంటూ మాతృత్వపు మాధుర్యాన్ని రంగరించిన ఆ కలం.. ఓ విప్లవ యోధుడిది.
‘తెలుగింటి వెలుగు రేఖ కాలోజీ.. తాను సత్యాన్ని శోధించే జాబాలీ.. అన్నా.. తెలంగాణ పొలికేకలా కాలన్నా.. స్వేచ్ఛ సమానతలను చాటేను లోకానా..’ అంటూ కాలోజీ గురించి మిత్ర అలియాస్ అమర్ రాసిన పాట..
‘అమ్మా.. నీ పేగు బంధాన్ని తెంచుకొని పుట్టినందుకు.. వచ్చే జన్మలోనైనా నీ కడుపున పుట్టి రుణం తీర్చుకుంటానమ్మా.. ఈ జన్మకు నా జీవితాన్ని పీడితజనానికి అంకితం చేస్తున్నానమ్మా..’ అంటూ మల్లోజుల కోటేశ్వర్రావు ఉరఫ్ కిషన్జీ వాళ్ల తల్లి మధురమ్మకు రాసిన లేఖలో కొన్ని
వ్యాక్యాలు..
● నిత్య నిర్బంధంలో సాహిత్య సృజన
● సిద్ధాంత పోరాటం.. సాహిత్యంపై ఆరాటం
● ప్రజాసాహిత్యానికి బాటలు వేసి అజ్ఞాత సూర్యులు
అమర్ అలియాస్ కూర దేవేందర్
ఆ రచనల వెనుక నమ్మిన సిద్ధాంతంతోపాటు భాషాభిరుచి ఉంది. ప్రజాసాహిత్యానికి పట్టం కట్టాలనే తపన ఉంది. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉంటూ నిత్య నిర్బంధంలోనూ సృజనాత్మకంగా అక్షరసేద్యం చేశారు. పాటలై ప్రవహించారు. వ్యాసాలుగా చైతన్య పరిచారు. కథలై కదిలించారు. కవితలై ఆలోచింపజేశారు. తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సంతకాలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అజ్ఞాతసూర్యులై వెలిగిన
అక్షరయోధులపై ప్రత్యేక కథనం.
●
సిరిసిల్ల: ఒకప్పటి సమాజంలో ఉన్న అసమానతలను పారదోలేందుకు పలువురు యువకులు విప్లవపంథాను ఎంచుకున్నారు. అడవిబాట పట్టి బందూకులు చేబూనారు. ‘అన్న’లుగా మారి అన్యాయాలపై ఎదురుతిరిగారు. ‘అన్న’లు అంటే మనకు తెలిసినంతవరకు తుపాకులు, విప్లవ సాహిత్య పుస్తకాలతో కనిపిస్తారనే ఊహ. కానీ.. అన్యాయాలపై ఎదురుతిరిగిన అన్నల్లోనూ పలువురు సాహిత్య రచన చేశారు. ఆ సాహిత్యంతో సమాజంలోని అన్యాయాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. తమ రచనల ద్వారా ప్రజలను జాగరూకులను చేశారు. ఇలా ఓ చేత తుపాకీ.. మరో చేత అక్షరసేద్యం చేశారు.