మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై వారు సోమవారం తహసీల్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ముజీబ్కు వినతిపత్రం అందించారు. మండల కేంద్రంలో కేంద్రియ విద్యాలయం 2019లో మంజూరై ఏడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇక్కడి విద్యార్థులు నష్టపోతున్నారని వార్డు సభ్యుడు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్నూర్కు కేటాయించిన కేంద్రీయ విద్యాలయం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు. 2022లో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన యువకులు తహసీల్ కార్యాలయ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు.


