పిట్లం(జుక్కల్): మండలంలోని రూమ్ తండాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా ప్రజలకు పర్యావరణ పరిరక్షణ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీట్ ఆఫీసర్ గయాజుద్దీన్ మాట్లాడుతూ.. ఒక చెట్టును పెంచాలంటే కొన్ని సంవత్సరాలు శ్రమించవలసి వస్తుందని, అదే నరికి వేయడం నిమిషాలలో పని అన్నారు. ఎవరు కూడా చెట్లను నరకరాదన్నారు. చెట్లను పెంచడం ద్వారా మానవాళి మనుగడ, పరిరక్షణ జరుగుతుందని, చెట్లను నరికి వేయడం మానివేయాలని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ను నిర్మూలించి స్వచ్ఛమైన సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సర్పంచ్ ఏంసింగ్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణ, తాడ్వాయి పోలీస్స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న పండరి గౌడ్, రాజేందర్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. వారు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్వయంగా వారిద్దరికి ఏఎస్సై చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉత్తమ సేవలందించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో విభాగానికి చెందిన డెలివరీ కాని పార్సిళ్లను మంగళవారం వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి డిపో ఆవరణలో వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని సూచించారు.


