న్యూస్రీల్
పశువుల ఎరువు కరువై..
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
– 8లో u
అన్నదాతపై ఏటా ఎరువుల ధరల పిడుగు పడుతూనే ఉంది. ఏడాదిలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగుసార్లు పెంచాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నకు సాగు మరింత భారంగా మారింది.
– బాన్సువాడ
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 3.20 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవనుంది. 90,684 ఎకరాల్లో సోయాబీన్, 54,500 ఎకరాల్లో మక్క, 42,887 ఎకరాల్లో పత్తి, 45,500 ఎకరాల్లో కంది, 3,382 ఎకరాల్లో పెసర, 2,858 ఎకరాల్లో మినుము పంటలు సాగవనున్నాయి. ఆయా పంటలు సాగు చేయడానికి మొత్తం 1,02,325 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీంట్లో 50,079 మెట్రిక్ టన్నుల యూరియా, 29,316 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 11,317 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,648 మెట్రిక్ టన్నుల ఎంవోపీ ఎరువుల అవసరం ఉంటుంది.
సాగు పనుల్లో అన్నదాతలు..
వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు దున్ని భూములు సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎరువుల కొనుగోలు కోసం ఫర్టిలైజర్ షాప్లకు వెళ్తున్న రైతులు అవాక్కవుతున్నారు. ఈసారి సీజన్కు ముందే కంపెనీలు ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ. 75 నుంచి రూ. 375 వరకు ధర పెరిగిందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడంతో దున్నకాల ఖర్చులూ తడిసిమోపెడవుతాయని ఆందోళన చెందుతున్నారు.
దున్నకాలూ భారమే..
రైతులు దుక్కులనుంచి నాట్లు వేసే వరకు మూడు నాలుగుసార్లు భూములు దున్నుతారు. ఒక సాలు దుక్కి దున్నడానికి గత సీజన్లో ట్రాక్టర్ కిరాయి గంటకు రూ. 1,200 తీసుకున్నారు. ఈసారి డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు కిరాయి పెంచేశారు. ప్రస్తుతం రూ. 1,300 నుంచి రూ. 1400 వరకు తీసుకుంటున్నారు.
ఏడాది కాలంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను నాలుగు సార్లు పెంచారు. ప్రస్తు పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలి.
– గులెపల్లి గంగాధర్, రైతు, బాన్సువాడ
డిజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ల యజమానులు దున్నకాలకు సంబంధించి కిరాయిలు పెంచారు. ఎరువుల ధరలు కూడా పెరగడంతో వ్యవసాయం లాభం లేకుండా పోతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇవ్వాలి.
– బర్ల నారాయణ, రైతు, బాన్సువాడ
గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువులకు కొరత ఏర్పడింది. దీంతో పంటలకు పోషకాలు అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతోంది. పంటల సాగులో డీఏపీ, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను సైతం సమపాళ్లలో వాడాల్సి ఉంటుంది. మొక్కలకు కావాల్సిన పోషకాలు అందని సమయంలో రసాయన ఎరువుల రూపంలో అందిస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాయి. అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏటా పెరుగుతున్న
ఎరువుల ధరలు
బస్తాకు గరిష్టంగా
రూ. 375 వరకు పెంపు
రైతన్నకు భారమవుతున్న సాగు ఖర్చులు


