కామారెడ్డి టౌన్: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఏ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. నిజాంసాగర్ చౌరస్తా వద్ద సిగరెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ పొగాకు, గుట్కా, సిగరెట్ వంటి వ్యసనాల బారిన పడి ఎంతోమంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఈ దురలవాట్ల వల్ల ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే ప్రజలు ఈ అలవాట్లను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో ఐడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ప్రతినిధి సాజిద్, జిల్లా కోశాధికారి కవిత, వైద్యులు వినోద్, ప్రవీణ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.


