తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడిలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ ఇండ్లలో బోనాలను వివిధ రంగులతో అందంగా అలంకరించారు. అనంతరంగా డప్పువాయిద్యాలతో బోనాలను ఆలయాల వద్ద వరకు ఊరేగింపు తీసుకెళ్లారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు.
బ్రాహ్మణపల్లిలో..
నిజాంసాగర్(జుక్కల్): బ్రాహ్మణపల్లిలో ఆదివారం గ్రామ దేవతలకు బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలో బోనాలతో ఊరేగింపు ర్యాలీ చేపట్టారు. ఆలయాల చుట్టూ బోనాల ప్రదక్షణలు చేశారు. పిల్లాపాపలను సల్లంగా చూడాలని అమ్మవార్లను, గ్రామ దేవతలను వేడుకున్నారు. సర్పంచ్ గరబోయిన చంద్రకళ, గ్రామస్థులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేటలో ఆదివారం బూర్గుల పోచమ్మ, నల్ల పోచమ్మలకు ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను కొత్త చీరలు, మామిడి తోరణాలు, రంగులు వేసి ఆకర్షణీయంగా అలంకరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారి మొక్కు లు తీర్చుకున్నారు. సర్పంచ్ దివిటి రమేశ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి కల్కి ఆలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం అన్నప్రసాదం అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, శ్రీనివాస్ దంపతుల సహకారంతో భక్తులకు అన్నప్రసాదం అందజేసినట్టు బాలు తెలిపారు. ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్కుమార్, సుధాకర్, వెంకన్న, రాజేందర్ పాల్గొన్నారు.


