కూలీల కొరతే ప్రధాన కారణం..
● జిల్లాలో 17 వందల స్టాండర్డ్
బ్యాగుల కొనుగోలు లక్ష్యం
● ఇప్పటివరకు సేకరించింది
850 బ్యాగులే..
ఎల్లారెడ్డిరూరల్: జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యాన్ని సాధించడంలో అటవీశాఖ వెనకంజలో ఉంది. వానాకాలం సమీపిస్తున్నా ఇప్పటికి సగం లక్ష్యమే చేరుకుంది. కూలీలు సైతం ఆసక్తి చూపించడం లేదు.
జిల్లా అటవీశాఖ పరిధిలో ఎనిమిది రేంజ్లు ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, నాగిరెడ్డిపేట, గాంధారి, మాచారెడ్డిలలో రేంజ్ విస్తరించి ఉంది. 50 ఆకులకు ఒక కట్ట చొప్పున చేస్తారు. వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా పరిగణిస్తారు. జిల్లాలో 17 వందల స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యం. అయితే జిల్లాలో ఇప్పటివరకు 850 స్టాండర్డ్ బ్యాగులే సేకరించారు.
తునికాకు సేకరించే కూలీలకు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లాల నిర్వాహకులు 50 ఆకుల కట్టకు రూ. 3.40 పైసల చొప్పున చెల్లిస్తారు. ఈ కూలి గిట్టుబాటు కాకపోవడంతో తునికాకు సేకరణకు కూలీలు ముందుకు రావడం లేదు. కాగా తునికాకు సంబంధించిన ఆకు లభ్యత తక్కువగా ఉండడం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. కూలీలు తునికాకు సేకరణకన్నా ఉపాధి హామీ పథకంలో పనులు చేయడానికి మొగ్గు చూపుతున్నారని, దీంతో తునికాకు సేకరణ లక్ష్యం చేరడం ఇబ్బందిగా మారిందని అటవీ అధికారులు అంటున్నారు. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంటున్నారు.


