ఎల్లారెడ్డి: లారీలను పంపించి తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించాలని డిమాండ్ చేస్తూ తిమ్మారెడ్డిగేట్ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి తిమ్మారెడ్డిగేట్ కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఎల్లారెడ్డి –బాన్సువాడ ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలనుంచి తూకం వేసిన వడ్ల బస్తాలను తరలించకపోవడంతో వర్షానికి తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రెండు లారీలను పంపి రెండు, మూడు రోజులలో ధాన్యం పూర్తిగా తరలిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


